మహిళలలై దాడులను ఉపేక్షించం
ABN , First Publish Date - 2020-09-06T10:53:16+05:30 IST
జిల్లాలో మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినా, దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. డీపీవో
![మహిళలలై దాడులను ఉపేక్షించం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020090605175971/09062020052300n86.jpg)
ఎస్పీ రాజకుమారి
విజయనగరం క్రైం, సెప్టెంబరు 5 : జిల్లాలో మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినా, దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. డీపీవో కార్యాలయ సమావేశ మందిరంలో పార్వతీపురం సబ్డివిజన్ పోలీస్ అధికారులతో శనివారం ఆమె నేరాలపై సమీక్ష నిర్వహించారు. న్యాయం కోసం స్టేషన్ను ఆశ్రయించే మహిళలు, వృద్ధులు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల పట్ల వినమ్రతతో మెలగాలన్నారు. వారుచెప్పే సమస్యలను పూర్తిగా విని పరిష్కారం చూపాలని సూచించారు.
పోలీస్ సిబ్బంది.. అధికారులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో సెన్సిటైజేషన్ వర్క్షాపు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాలను, అత్యాచారాలను తీవ్రంగా పరిగణించి.. కేసుల దర్యాప్తును వారంలో పూర్తిచేయాలని నిర్దేశించారు. అక్రమ మద్యం, సారా నియంత్రణకే ఎస్ఈబీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న విషయాన్ని మరవద్దన్నారు.
అసాంఘిక కార్యకలాపాలను ఎవరు ప్రోత్సహించినా శాఖా పరమైన చర్యలు తప్పవని, అవినీతి అరోపణలు వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో పార్వతీపురం ఇన్చార్జి డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బి డీఏస్పీ వెంకటప్పారావు, ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, న్యాయ సలహాదారుల ప్రతినిధి పరుశురాం, సీఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.