ప్రవేశాలు ఎలా?
ABN , First Publish Date - 2020-03-16T09:59:53+05:30 IST
గురుకులాలు, ఆదర్శ పాఠశాల్లో ప్రవేశాలకు ఇంతవరకూ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఆయా విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.
గురుకులాలు, ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీలో జాప్యం
పరీక్ష లేక లాటరీపై స్పష్టత కరువు
ప్రభుత్వ ప్రకటన కోసం విద్యార్థుల ఎదురుచూపు
కలెక్టరేట్/ మెరకముడిదాం, మార్చి 15 :
గురుకులాలు, ఆదర్శ పాఠశాల్లో ప్రవేశాలకు ఇంతవరకూ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఆయా విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం ఏటా జనవరి చివరిలో నోటిఫికేషన్ జారీ చేస్తోంది. ఆ ప్రకటన ఆధారంగా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు. ప్రవేశ పరీక్ష మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో జరిగేది. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో ప్రవేశ పరీక్ష కోసం చదువుతున్న విద్యార్థులు నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్నారు.
బీసీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 35 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలోనూ ఐదో తరగతిలో 80 సీట్లు ఉంటాయి. ఎంపిక రాత పరీక్షా ఆధారంగా చేపడతారు. జిల్లాలో సుమారు మూడు వేల వరకూ సీట్లు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన సుమారు 8 వేలు మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. అత్యధిక మార్కులు వచ్చిన వారికి సీట్లు కేటాయిస్తారు. చాలా మంది విద్యార్థులు కోచింగ్ సెంటర్ల ద్వారా ఈ పరీక్ష కోసం శిక్షణ తీసుకుంటున్నారు.
కాగా ప్రవేశాలకు సంబంధించి ఇప్పటి వరకూ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఆయా విద్యార్థులపాటు వారి తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు నెట్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇస్తారా? లేక లాటరీ తీస్తారా అనేదానిపై అయోమయంలో ఉన్నారు. ఇదే విషయమై గురుకులు పాఠశాలల జిల్లా కన్వీనర్ చంద్రావతి వద్ద ప్రస్తావించగా గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశాల కోసం ఇంకా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయలేదని వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.
మోడల్ పాఠశాలల విషయానికొస్తే ఐదేళ్ల కిందట ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన ఉంటుంది. జిల్లాలో 16 పాఠశాలలు ప్రారంభించగా, చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని మెరకముడిదాం మండలం గర్భాంలో మరో పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాలల్లో మొరుగైన ఫలితాలు వస్తుండటంతో ప్రవేశాలకు ఏటా డిమాండ్ పెరుగుతోంది. ప్రారంభంలో ప్రవేశాలకు అంత ఆసక్తి చూపకపోయినప్పటికీ రానురాను ఆదరణ పెరిగింది.
ఆరోతరగతిలో ప్రవేశాలకు సంబంధించి జనవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేయడం.. ఆన్లైన్లో విద్యార్ధులు దరఖాస్తులు చేసుకోవడం మార్చిలో ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక పరీక్షలు రాయడం జరిగేది. ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ తరువాత ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 8వ తరగతి లోపు విద్యార్థులకు ప్రవేశపరీక్షలు నిర్వహించకూడదన్న కారణంతో రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రవేశాలను లాటరీ విధానంలో చేపడ్తారని సమాచారం.
స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లా విద్యాఖాధికారి జి.నాగమణి వద్ద ప్రస్తావించగా మోడల్ పాఠశాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి పరీక్షను ప్రభుత్వం రద్దు చేసిందని, దీనికి సంబంధించి త్వరలోనే విద్యాశాఖ కమిషనరు నుంచి ఆదేశాలు రానున్నాయని చెప్పారు. లాటరీ విధానంలో సీట్లు భర్తీ చేయాలన్న ఆలోచన ఉందన్నారు.