నిర్వాసితుల భూమికి పట్టాలు ఇవ్వండి

ABN , First Publish Date - 2020-12-29T05:22:44+05:30 IST

వెంగళరాయసాగర్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు రిజర్వాయర్‌ మిగులు భూమిలో పట్టాలు ఇవ్వాలని నిర్వాసితులు కోరారు.

నిర్వాసితుల భూమికి పట్టాలు ఇవ్వండి
వినతిపత్రం అందిస్తున్న గిరిజన సంఘం నాయకులు

 పార్వతీపురం, డిసెంబరు 28: వెంగళరాయసాగర్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు రిజర్వాయర్‌ మిగులు భూమిలో పట్టాలు ఇవ్వాలని నిర్వాసితులు కోరారు.  ఈమేరకు పార్వతీపురం పీడబ్ల్యూడీ కార్యాలయం ముందు గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా గిరిజన సంఘం నాయకుడు గవరయ్య మాట్లాడుతూ  రిజర్వాయర్‌ నిర్మాణంలో సాలూరు మండలం కుద్దాడవలస, పందిరిమామిడివలస గ్రామాలు మునిగి పోవడంతో మేమంతా భూములు కోల్పోయామన్నారు. రిజర్వాయర్‌ నిర్మాణం సమయంలో  సేకరించిన భూమి సుమారు 300 ఎకరాలు ప్రాజెక్టు దిగువన మిగులు భూమిగా ఉండిపోయిందని వాపోయారు. రిజర్వాయర్‌ నిర్మాణం డిజైన్‌ మార్పు చేయడం వల్ల డ్యామ్‌ గట్టు దిగువన భూమి మిగిలిపోయిందని, ఈ భూమిని 45 సంవత్సరాల కిందట నిర్వాసితులైన కుద్దాడవలస, పందిరిమామిడివలస గ్రామాల గిరిజనులకు సాగు చేసుకోమని అప్పటి ఇరిగేషన్‌, ఐటీడీఏ అధికారులు అప్పగించినట్టు చెప్పారన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఈ భూములకు సంబంఽధంచి పట్టాలు ఇవ్వలేదని వాపోయారు. ప్రస్తుతం సాగు చేసుకుంటున్న రిజర్వాయర్‌ మిగులు భూమిలో పట్టాలను ఇప్పటికైనా ఇవ్వాలని డిమాండ్‌  చేశారు. అనంతరం కార్యాలయ అధికా రులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సోమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొల్లి గంగునాయుడు, చింతల తవిటినాయుడు, గిరిజనులు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-29T05:22:44+05:30 IST