కలుషిత నీటినే తాగమంటారా..?
ABN , First Publish Date - 2020-12-02T05:26:09+05:30 IST
కలుషిత నీటిని ఎన్నాళ్లు తాగమంటారని ఇంజినీరింగ్ విభాగం డీఈ అప్పా రావును పట్టణ పౌరసంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, సీఐటీయూ డివి జన్ కార్యదర్శి గొర్లి వెంకటరమణ నిలదీశారు.

పార్వతీపురంటౌన్, డిసెంబరు 1: కలుషిత నీటిని ఎన్నాళ్లు తాగమంటారని ఇంజినీరింగ్ విభాగం డీఈ అప్పా రావును పట్టణ పౌరసంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, సీఐటీయూ డివి జన్ కార్యదర్శి గొర్లి వెంకటరమణ నిలదీశారు. 24వ వార్డులోని బొగ్గులవీధి, నాయుడు వీధుల్లో తాగునీటి పైప్లైన్ పాతది కావడంతో చాలాకాలంగా కలుషిత నీరు సరఫరా అవుతోందని సన్యాసిరావు, వెంకటరమణ మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇంతలో డీఈ కల్పించుకుని చాలా వీధుల్లో పాత పైపులైన్లే ఉన్నాయని, అందులో మా తప్పు ఏమీ లేదన్నారు. దీంతో మున్సిపల్ కమిషనర్ కె. కనకమహాలక్ష్మి ఎదుటే ప్రజాసంఘ నాయకులు, డీఈల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట రెండు వీధుల ప్రజలతో ధర్నా చేపడతామని ప్రజాసంఘనాయకులు హెచ్చరించారు. ఇంతలో కమిషనర్ కలుగజేసుకొని త్వరలో కలుషితనీటి సరఫరా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.