న్యాయం చేయండి
ABN , First Publish Date - 2020-09-01T10:09:59+05:30 IST
ఓ బడాబాబు తమ భూములను ఆక్రమించుకుని, తమను ఊరి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.. ఊరు ఖాళీ చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నాడు.. తమకు తగిన

భూముల ఆక్రమణ.. ఊరు ఖాళీ చేయాలని బెదిరింపులు..
75 గిరిజన కుటుంబాల ఆందోళన
మెంటాడ, ఆగస్టు 31: ఓ బడాబాబు తమ భూములను ఆక్రమించుకుని, తమను ఊరి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.. ఊరు ఖాళీ చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నాడు.. తమకు తగిన న్యాయం చేయాలని ఆగూరు రెవెన్యూ పరిధిలోని గిరిజనులు వేడుకుంటున్నారు. ఈమేరకు సోమవారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు రాకోటి రాములు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
సంగం గుడ్డివలస, కింద గూడం, పణుకువలస, సిడగంవలసకు చెందిన 75 కుటుంబాలకు చెందిన తాము 71 ఎకరాల ప్రభుత్వ భూమిలో జీడితోటలు, పోడు వ్యవసాయం సాగు ద్వారా జీవనోపాధి పొందుతున్నామని చెప్పారు. అయితే జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన బడాబాబు మరికొందరు కలిసి తమ భూమిని ఆక్రమించి, స్థానిక తహసీల్దార్ డి.రవి రెవెన్యూ సిబ్బంది సహకారంతో తప్పుడు పత్రాలు సృష్టించి వారిపేరును రిజిస్ర్టేషన్ చేయించుకొని తమ పొట్టకొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పుడా పెద్ద మనిషి అతని అనుచరులు తమను గ్రామాలు ఖాళీ చేసి వెళ్లకపోతే చంపేస్తామని బెదిరిస్తు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన అనంతరం కలెక్టర్ హరిజవహర్లాల్, ఆర్డీవో భవానీశంకర్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేసి, గిరిజనులకు న్యాయం చేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చినట్టు రాములు తెలిపారు. కార్యక్రమంలో గేదెల పెదరాము, ఈదుబిల్లి సోములు, సిడగం సింహా చలం, సిడగం సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.