చింతామల బాటలో సిరివర

ABN , First Publish Date - 2020-09-13T19:11:22+05:30 IST

తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో..

చింతామల బాటలో సిరివర

రోడ్డు కోసం చందాలు వేసుకుంటున్న గ్రామస్థులు

ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపాటు


సాలూరు(విజయనగరం): తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో ఉన్న కొదమ పంచాయతీ సిరివర గ్రామ గిరిజనులు స్వచ్ఛందంగా రహదారి నిర్మించుకోవాలని తీర్మానం చేసుకున్నారు. చింతామల గ్రామస్థులను ఆదర్శంగా తీసుకుని వారి లాగే చందాలను పోగు చేస్తున్నారు. సిరివరతో పాటు డోయివర, తాటిపుటి, పోయివాడ, చిలకమెండంగి గ్రామాల గిరిజనులు శనివారం సిరివరలో గిరిజన నేతలు కృష్ణ, కుమార్‌, మాలతి తదితరుల ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. తమ గ్రామాలకు రోడ్డు కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని అందరూ ముక్తకంఠంతో అనుకున్నారు.


సిరివర గ్రామానికి చెందిన కొండతామర గిందే అనే బాలింతను 2018 జూలై 30న ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి 10 కిలోమీటర్లు డోలీతో మోసుకువెళ్లడం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దృష్టికి సైతం వెళ్లినా స్పందన లేకపోవడంపై వారంతా విచారం వ్యక్తం చేశారు. తమకు రోడ్డు వచ్చేందుకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ సహకరించాలని కోరారు. ఈ ఐదు గ్రామాల్లో 142 గిరిజన కుటుంబాలు ఇంటికి మూడు వేల రూపాయల చొప్పున చందాలను పోగు చేస్తున్నారు. సిరివర నుంచి మక్కువ మండలం నంద వరకు రోడ్డు నిర్మిస్తే ఈ ఐదు గ్రామాలకు సౌకర్యంగా ఉంటుంది. ఆ మేరకు రహదారి నిర్మాణం కోసం రూ.4,26,000తో చందాలు సేకరించి పనులు ప్రారంభిస్తామని గిరిజన నేత కృష్ణ తెలిపారు. ఇప్పటికే కొందరు చందా అందజేసినట్లు చెప్పారు.




Updated Date - 2020-09-13T19:11:22+05:30 IST