ప్రభుత్వానికి ఎదురు దెబ్బ!
ABN , First Publish Date - 2020-05-30T10:45:10+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరో మొట్టికాయ వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగెడ్డ రమేష్కుమార్ తొలగింపు వ్యవహారంపై శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎస్ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ..
నిమ్మగెడ్డ రమేష్కుమార్ను ఈసీగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశం
తీర్పును స్వాగతించిన టీడీపీ నేతలు
ఇకనైనా జగన్ తీరు మార్చుకోవాలని హితవు
(విజయనగరం టౌన్/పూసపాటిరేగ/పార్వతీపురం)
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరో మొట్టికాయ వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగెడ్డ రమేష్కుమార్ తొలగింపు వ్యవహారంపై శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎస్ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను కొట్టేసింది. నిమ్మగెడ్డ రమేష్కుమార్ను ఎన్నికల కమిషనర్గా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడేలా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వరుసగా తీర్పులను వెలువరించడం శుభ పరిణామమని తెలుగుదేశం పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ పరిణామం జగన్ సర్కారుకు చెంపపెట్టు వంటిందని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను, ప్రతినిధులను కించపరిచేలా కులాలను ఆపాదించడం అమానుషమని విమర్శించారు. న్యాయస్థానాల్లో వరుసగా దెబ్బలు తగులుతున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఇకనైనా తీరు మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని హితవు పలికారు.
అన్యాయంగా తొలగించారు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్కుమార్ను అక్రమంగా తొలగించారు. దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చారు. దీనిపై హైకోర్టు తప్పుపడుతూ తీర్పునివ్వడం హర్షణీయం. ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. లేకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోంది.
- చిరంజీవులు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం
చరిత్రాత్మకం
హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం. ప్రజాస్వామ్య విలువలు కాపాడేలా తీర్పు వెలువడింది. ఇది ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తూ న్యాయమూర్తులపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలకు ఇది చెంపపెట్టు. ఇకనైనా తీరు మార్చుకోకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలి. ప్రక్రియను తాజాగా చేపట్టాలి.
-సుజయ్కృష్ణ రంగారావు, మాజీ మంత్రి
సత్యమే గెలిచింది
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తొలగింపు విషయంలో చివరికి సత్యమే గెలిచింది. రాజ్యాంగ వ్యవస్థలపై అమర్యాదగా ప్రవర్తిస్తున్న వారికి కనువిప్పు కలగాలి. ఇకైనా ముఖ్యమంత్రి జగన్ నియంతృత్వ ధోరణిని విడనాడాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా వ్యవహరించాలి. లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు.
-మహంతి చిన్నంనాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు