-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Ycp Cader meeting
-
వైసీపీలో బయటపడ్డ విభేదాలు!
ABN , First Publish Date - 2020-12-15T05:56:43+05:30 IST
మాకవరపాలెం మండలంలో అధికార పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. చివరకు పార్టీ మండల అధ్యక్షుడ్నే మార్చాలన్న డిమాండ్ను తెరపైకి వచ్చింది.

మాకవరపాలెం మండలంలో గ్రూపులకు
పార్టీ మండల అధ్యక్షుడే కారణమని పలువురు ఆరోపణ
రాచపల్లి జంక్షన్ సమీపంలో ఏర్పాటైన వనభోజనాల్లో గళం విప్పిన శ్రేణులు
మాకవరపాలెం, డిసెంబరు 14 : మాకవరపాలెం మండలంలో అధికార పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. చివరకు పార్టీ మండల అధ్యక్షుడ్నే మార్చాలన్న డిమాండ్ను తెరపైకి వచ్చింది. ఇందుకు రాచపల్లి సెంటర్లోని కామేశ్వరమ్మ గుడి వద్ద సోమ వారం ఏర్పాటైన వనభోజనాలు వేదికగా నిలిచింది. మండలంలోని సుమారు 18 పంచాయతీల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి విచ్చేశారు. తొలుత అంతా సమావేశమయ్యారు. గత అసెంబ్లీ ఎన్ని కల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని నేడు మీరు వైసీపీ నాయకులే కాదని పార్టీ మండల శాఖ అధ్యక్షుడు దూషిస్తున్నారని జి.వెంకటాపురానికి చెందిన నాయ కుడు బండారు గంగరాజు, అడిగర్లపాలెం ఎంపీటీసీ మాజీ సభ్యుడు అడిగర్ల దేముడు ఆరోపించారు. అదేవిధంగా గ్రామాల్లో వైసీపీ ఎంతో బలంగా ఉన్నప్పటికీ, పార్టీ మండల అధ్యక్షుడు వల్ల గ్రూపులు ఏర్పడ్డాయని పలువురు సీనియర్ నాయకులు వాపోయారు. ఇటీవల రేషన్ బియ్యం పంపిణీ చేసే ట్రక్కులకు అర్హుల ఎంపిక విషయంలో స్థానిక నాయకులను సంప్రదించ లేదని వాపోయారు. అంతే కాకుండా బూరుగుపాలెం సచివాలయం ఒక్కదానికే మూడు ట్రక్కులు మంజూరు చేసి, మేజర్ పంచాయతీలైన రాచపల్లి, గిడుతూరు, జి.కోడూరు, తూటిపాల, లచ్చన్నపాలెం పంచాయతీలకు మొండిచెయ్యి చూపారని పలువురు ఆరోపించారు. పనిచేసిన నాయకులను పక్కన పెట్టి, ఓట్లు లేని నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కొత్త మండల అధ్యక్షుడ్ని ఎన్నుకోవాలని వీరంతా తీర్మానం చేశారు. దీనిపై తర్వలోనే మరో సమావేశం నిర్వస్తామని తెలిపారు. ఇదిలావుంటే, ఈ సమావేశంపై వైసీపీ మండల అధ్యక్షుడుకి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. సీనియర్ నాయకులు కాళ్ళ త్రినాథ్, రుత్తల సర్వం, మూకల బాలకృష్ణ, వెలగా వెంకటరమణ, రుత్తల జమిందార్, అప్పలనాయుడు, ఈశ్వరరావు, అడిగర్ల శ్రీనివాసరావులతో పాటు సుమారు పద్ధెనిమిది పంచాయతీల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.