ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు తావివ్వొద్దు

ABN , First Publish Date - 2020-12-20T05:44:23+05:30 IST

టిడ్కో ఇళ్ల కేటాయింపులో ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్టయితే కఠిన చర్యలు తప్పవని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు.

ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు తావివ్వొద్దు
టిడ్కో ఇళ్ల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి ముత్తంశెట్టి

మంత్రి ముత్తంశెట్టి

విశాఖపట్నం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): టిడ్కో ఇళ్ల కేటాయింపులో ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్టయితే కఠిన చర్యలు తప్పవని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో టిడ్కో ఇళ్ల పంపిణీకి జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మూడేళ్లపాటు పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు జాప్యం చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తున్నామన్నారు. 300 చదరపు అడుగుల ఇల్లు పొందినవారు గతంలో కట్టిన డీడీలను వెనక్కి ఇచ్చేస్తామని, 365, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులు కట్టిన డీడీల్లో సగం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తామని మంత్రి అన్నారు. ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గం వారీగా చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల ఐదు వరకూ కేటాయించిన తేదీల్లో ఎంపికైన వారందరికీ సంబంధిత జోనల్‌ కమిషనర్ల ద్వారా కేటాయింపు ఉత్తర్వులను అందజేయాలని కమిషనర్‌ సృజనకు సూచించారు. లబ్దిదారులు  లాటరీ ప్రక్రియ ముగిసిన వెంటనే డాక్యుమెంటేషన్‌, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగేందుకు చర్యలు తీసుకోవాలని పీడీ శ్రీనివాస్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో గాజువాక, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేలు తిప్పలనాగిరెడ్డి, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులు,  వైసీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-20T05:44:23+05:30 IST