గాంధీ, అబ్దుల్ కలామ్ మార్గంలో పయనించాలి
ABN , First Publish Date - 2020-10-04T11:21:51+05:30 IST
రచయితలు, వాతావరణ పరిశోధన ప్రతినిధులు స్థిర అభివృద్ధి, లక్ష్య సాధనకు జాతిపిత మహాత్మాగాంధీ, దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్కలామ్ మార్గంలో పయనించాలని కాలిఫోర్నియా స్టేట్ యానివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్కే రమేశ్ పేర్కొన్నారు.
కాలిఫోర్నియా స్టేట్ యానివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్కే రమేశ్
గాయత్రీ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
కొమ్మాది, అక్టోబరు 3: రచయితలు, వాతావరణ పరిశోధన ప్రతినిధులు స్థిర అభివృద్ధి, లక్ష్య సాధనకు జాతిపిత మహాత్మాగాంధీ, దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్కలామ్ మార్గంలో పయనించాలని కాలిఫోర్నియా స్టేట్ యానివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్కే రమేశ్ పేర్కొన్నారు. శనివారం గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల(అటానమస్)లో ప్రపంచంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు, వాటివల్ల వాటిల్లుతున్న ప్రాణ, ఆర్థిక నష్టాల నివారణకు ‘చురుకైన స్థిర అభివృద్ధి వ్యవస్థలు-రానున్న దశాబ్దం’ అనే అంశంపై ఐఈఈఈ ఇండియా కౌన్సిల్, ఐఈఈఈ వైజాగ్బే, గాయత్రి విద్యాపరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (అటానమస్) సంయక్తంగా రెండు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
వాతావరణ మార్పుల వ్యతిరేక ప్రభావాన్ని తగ్గించాల్సిన ప్రాధాన్యతను వివరించారు. ఐఈఈఈ ఇండియా కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.కె.సింగ్ వాతావరణంలో మార్పుల గురించి వివరించారు. ఈ సదస్సులో ప్రవేశపెట్టనున్న పరిశోధన పత్రాల నాణ్యతను సరిచూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గాయత్రి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఏబీకే రావ్ మాట్లాడుతూ స్థిర అభివృద్ధి, లక్ష్య సాధనలో శాస్త్ర సాంకేతిక జ్ఞానం, నవకల్పనల ఫలవంతమైన పాత్రల గురించి ఉదహరించారు.
గాయత్రి విద్యాపరిషత్ అధ్యక్షులు పీఎస్ రావ్ మాట్లాడుతూ సదస్సులో చర్చించే అంశం హృదయాలకు అత్యంత సన్నిహితమైనదన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్ ఆర్-10 డైరెక్టర్ శ్రీదీపక్, సదస్సు నిర్వాహక అధ్యక్షుడు సీవీకే భాను, ఐఈఈఈ వైజాగ్బే అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.