దళితులపై దాడులను అరికట్టాలి
ABN , First Publish Date - 2020-10-03T09:29:27+05:30 IST
దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్రకార్యదర్శి కళింగ లక్ష్మణరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పెంటపాడు/భీమడోలు, ఆక్టోబరు, 2 : దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్రకార్యదర్శి కళింగ లక్ష్మణరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రసమితి పిలుపు మేరకు మండలంలోని ఆకుతీపాడు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై అత్యాచారాలు ఎక్కువైపోయాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం దళిత వ్యతిరేకవిధానాలు విడనాడకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్లో దళిత యువతి అత్యాచారం, హత్యను నిరసిస్తూ శుక్రవారం కేవీపీఎస్, అంబేడ్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో భీమడోలు జంక్షన్లో దళిత సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేశారు.
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ బీజేపీ పాలనలో దళితులు, ముస్లింలు, మహిళలు బలహీన వర్గాలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయన్నారు.ఈ కార్యక్రమంలో వంకా రామకృష్ణ, జాలపర్తి నాగేశ్వరరావు, అద్దంకి పురుషోత్తం, రాజేష్, ఉప్పుల సువర్ణరాజు, లక్ష్మయ్య, రాచ ప్రోలు అనిల్ కుమార్, సుమన్బాబు, సాల్మన్రాజు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.