తెలుగుదేశం నేతల అరెస్టు
ABN , First Publish Date - 2020-10-03T09:22:23+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కృష్ణాపురం గోశాలలో జరిపిన నిరసన చట్టవ్యతిరేకమంటూ మహావిశాఖ 98వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పీవీ నరసింహం, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు పాశర్ల ప్రసాద్లను ఆరిలోవ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

సింహాచలం, అక్టోబరు 2: వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కృష్ణాపురం గోశాలలో జరిపిన నిరసన చట్టవ్యతిరేకమంటూ మహావిశాఖ 98వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పీవీ నరసింహం, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు పాశర్ల ప్రసాద్లను ఆరిలోవ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తొలగించిన గో సంరక్షకులను విధుల్లోకి తీసుకోవాలంటూ జూలై 14న దేవస్థానం నృసింహవనం ఆవరణలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దీనిపై అప్పటి ఈఓ దర్భముళ్ల భ్రమరాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై ఐపీసీ 447, 168, 269 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
సాయంత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ సందర్భంగా పాశర్ల మాట్లాడుతూ గో సంరక్షకులను తొలగించడంపై కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపామన్నారు. ఆ తరువాత రెండు రోజులకు కొవిడ్ నిబంధనలు పాటించకుండా మంత్రి ముత్తంశెట్టి, దేవస్థానం ఈఓ, 20 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు గోశాలను సందర్శించారని, తాము నిరసన తెలిపిన సందర్భంలో అన్ని నిబంధనలూ పాటించినా కేసు నమోదు చేయడం కక్షసాధింపేనన్నారు.