బెదిరిస్తున్నాడనే చంపేశారు

ABN , First Publish Date - 2020-12-28T05:24:03+05:30 IST

తనతో తిరగకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడనే కక్షతోనే రౌడీ షీటర్‌ సాయికుమార్‌(34)ని ముగ్గురు యువకులు కలిసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాఽథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది.

బెదిరిస్తున్నాడనే చంపేశారు
హతుడు సాయికుమార్‌ (ఫైల్‌ ఫొటో)

కొలిక్కివస్తున్న రౌడీ షీటర్‌ సాయికుమార్‌ హత్య కేసు

పోలీసుల అదుపులో ముగ్గురు

నిందితుల్లో ఒకరు మైనర్‌ 

విశాఖపట్నం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): తనతో తిరగకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడనే కక్షతోనే రౌడీ షీటర్‌ సాయికుమార్‌(34)ని ముగ్గురు యువకులు కలిసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాఽథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఆరిలోవకు చెందిన రౌడీషీటర్‌ కోరాడ సాయికుమార్‌ను శనివారం రాత్రి కొంతమంది యువకులు  హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు పాల్పడినట్టు అనుమానిస్తూ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో తాము ఎందుకు సాయికుమార్‌ను హత్య చేయాల్సి వచ్చిందనే వివరాలను వెల్లడించినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోరాడ సాయికుమార్‌ పదేళ్ల కిందట ఒకరి హత్య కేసు, అనేక బెదిరింపులు, దౌర్జన్యాలు, కొట్లాటల కేసుల్లో నిందితుడు కావడంతో పోలీసులు అతనిపై రౌడీషీట్‌ తెరిచారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా సాయికుమార్‌కు ఆరిలోవ ప్రాంతంలో దాదాగిరి చేస్తుండడంతో ఆ ప్రాంతంలో అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనితోపాటు పావురాల పంపిణీ చేయడం సాయికుమార్‌ హాబీ కావడంతో  ఆ ప్రాంతానికి చెందిన 18 ఏళ ్ల మైనర్‌బాలుడితోపాటు మరో ఇద్దరు యువకులు  ఆకర్షితులై అతనితో కలిసి తిరిగేవారు. తరచూ సాయికుమార్‌ ఇంటికి వెళ్లడం, అతను చెప్పిన పనులు చేస్తుండేవారు. ఈ క్రమంలో ఏడాదిన్నర కిందటి నుంచి సాయికుమార్‌కు వారికి మధ్య గ్యాప్‌ ఏర్పడింది. దీంతో వారంతా సాయికుమార్‌ ఇంటికి వెళ్లడం మానేయడంతోపాటు ఎక్కడైనా కనిపించినా గౌరవం ఇవ్వడం మానేశారు. దీంతో సాయికుమార్‌ వారిపై కక్ష పెంచుకున్నాడు. తనకు గౌరవం ఇవ్వకపోతే కొడతానని, చంపుతానని తరచూ బెదిరిస్తుండేవాడు. ఈక్రమంలోనే శనివారం మధ్యాహ్నం సాయికుమార్‌ వారితో గొడవపడ్డాడు. దీంతో సాయికుమార్‌ ఎలాగైనా తమను చంపేస్తాడని భావించిన ముగ్గురు యువకులు కలిసి అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. దీనిలోభాగంగా శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆరిలోవ నుంచి భరత్‌నగర్‌లోని తన ఇంటికి స్నేహితుడితో కలిసి బైక్‌పై సాయికుమార్‌ వస్తున్నట్టు గుర్తించిన ముగ్గురు యువకులు టీఐసీ పాయింట్‌ వద్ద మాటువేశారు. బైక్‌పై వెనుక కూర్చొన్న సాయికుమార్‌ను  ఒకరు రాడ్‌తో తలపై మోదగా, సాయికుమార్‌ కిందపడిపోయాడు. బైక్‌ను నడుపుతున్న యువకుడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. సాయికుమార్‌ కిందపడగానే మిగిలిన ఇద్దరు యువకులు కత్తితో పీక కోసేసి అక్కడ నుంచి పరారయ్యారు. స్థానికులు సాయికుమార్‌ను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాయికుమార్‌ మృతి చెందాడు. ఇదిలావుండగా హత్య కేసు విచార ణలో ఉన్నందున ఇప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు పేర్కొంటుండడం విశేషం. 


Updated Date - 2020-12-28T05:24:03+05:30 IST