హార్బర్లో చేపల మార్కెట్ రెడీ!!
ABN , First Publish Date - 2020-12-13T06:03:53+05:30 IST
ఫిషింగ్ హార్బర్లో అధునాతన చేపల మార్కెట్ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ నెలాఖరుకు దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చేపల విక్రయాలకు, కోతకు వేర్వేరుగా స్టాల్స్
విశాఖపట్నం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఫిషింగ్ హార్బర్లో అధునాతన చేపల మార్కెట్ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ నెలాఖరుకు దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ఎదురుగా రూ.2.75 కోట్లతో దీనిని నిర్మించారు. ప్రస్తుతం హార్బర్లో జెట్టీలపైనే చేపలు దింపడం, అక్కడే వేలం, అక్కడే కోయడం వంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. పరిశుభ్రత పాటించడం లేదు. ఈ పరిస్థితులను పూర్తిగా మార్చేసి, ఒక్కొక్కరికి ఒక్కోచోట వసతులు కల్పించేలా మార్కెట్ నిర్మాణం చేపట్టారు. చేపల విక్రయం ఒకచోట, చేపల కటింగ్ మరో చోట, నిల్వ చేసుకునే సౌకర్యం ఇంకోచోట కల్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చేవారికి క్యాంటీన్ సదుపాయంతోపాటు పార్కింగ్ వసతి కూడా ఏర్పాటు చేశారు. చేపల విక్రయానికి 100కు పైగా కౌంటర్లు, కటింగ్ కౌంటర్లు 60 వరకు ఏర్పాటు చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి నిరంతరం నీరు సరఫరాకు ఏర్పాట్లు చేశారు.