కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
ABN , First Publish Date - 2020-03-19T08:24:36+05:30 IST
కరోనా వైరస్ (కోవిడ్-10) వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు పటిష్టంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అన్నారు.
![కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు](https://media.andhrajyothy.com/appimg/galleries/202003190248149/03192020025431n13.jpg)
విశాఖపట్నం, మార్చి 18, (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్ (కోవిడ్-10) వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు పటిష్టంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అన్నారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో కోవిద్-19 రాకుండా తీసుకున్న చర్యలు గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం 6.45 గంటలకు విదేశాల నుంచి భారతీయులను తీసుకు వచ్చిన విమానంలో 185 మంది విశాఖ వస్తున్నారన్నారు. వారందరికీ విమానాశ్రయంలో పరీక్ష చేసి మూడు కేటగిరీలుగా చేసి తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. అనుమానం ఉన్న ఏ కేటగిరి వారిని ఛాతి ఆస్పత్రికి, బి కేటగిరికీ చెందిన వాళ్లను విమ్స్లోని క్వారంటైన్ సెంటర్లో ఉండేలా చర్యలు చేపడతామన్నారు. 185 మందిని నాలుగు దేశాల నుంచి విశాఖకు రప్పిస్తున్నారని, వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉంటారని భావిస్తున్నామన్నారు. ముందస్తు చర్యలు చేపట్టిన తరువాత వారందరినీ సొంత ప్రదేశాలకు చేర్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ముఖ్య కార్యదర్శికి తెలియజేశారు.