కూరగాయలతో సిరుల పంట

ABN , First Publish Date - 2020-11-04T02:27:38+05:30 IST

వ్యవసాయమే జీవనాఽధారమైన మండలంలోని జెర్రిపోతులపాలెం, నందవరపువానిపాలెం, చింతగట్ల, ఇప్పిలివానిపాలెంలో గల రైతులు కూరగాయల సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు.

కూరగాయలతో సిరుల పంట
కూరగాయల తోట

ఆదాయం తెస్తున్న సాగు

అధిక ప్రాధాన్యం ఇస్తున్న పెందుర్తి రైతులు

పెందుర్తి, నవంబరు 3: వ్యవసాయమే జీవనాఽధారమైన మండలంలోని జెర్రిపోతులపాలెం, నందవరపువానిపాలెం, చింతగట్ల, ఇప్పిలివానిపాలెంలో గల రైతులు కూరగాయల సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో ప్రధాన పంటగా వరిని సాగు చేసేవారు. అయితే వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలపై దృష్టి సారించారు. ఇంత వరకు అంతర్గ్గత పంటలుగా ప్రాధాన్యమిచ్చిన కూరగాయాల పెంపకాన్ని ఇప్పుడు ప్రధాన వ్యాపకంగా మార్చుకున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో రైతులు సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేస్తున్నారు. వంగ, బెండ, గోరు చిక్కుడు, బరబాటీ, టమాటా, బీర, కాకరకాయలతో పాటుగా పలు రకాల ఆకుకూరలు పండిస్తున్నారు. పంట పొలాలను చిన్న చిన్న కమతాలుగా ఏర్పాటు చేసి కూరగాయలు పెంచుతున్నారు. నీటి సౌకర్యం కలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నీరు, ఇక్కడి కొండ ప్రాంత వాతావరణం చక్కగా కుదరడంతో కూరగాయల సాగు సిరులు పండించింది. ఇక్కడ పండించిన కూరగాయలను నగరంలోని పూర్ణా మార్కెట్‌, రైతుబజార్‌లకు తరలించి విక్రయిస్తున్నారు. వేకువజామునే రైతులు ఆటోల్లో కూరగాయల బస్తాలను వేసుకుని నగరంలో హోల్‌సేల్‌గా విక్రయిస్తుంటారు. ఎకరాకు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు పెట్టుబడి అవుతుందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. పెంపకం ఆరంభం నుంచి మూడు నెలల్లోనే  కూరగాయల పంట చేతికొస్తుంది. పెట్టుబడి, ఇతర ఖర్చుల తీసివేయగా ఆదాయం బాగానే ఉంటుందని చెబుతున్నారు. మండు వేసవిలో  సైతం ప్రత్యేక శ్రద్ధతో కూరగాయలు పండిస్తున్నారు. అయితే రవాణా సదుపాయం లేకపోవడం, దళారులు ఎక్కువగా ఉండడంతో కొంత ఇబ్బందులున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-11-04T02:27:38+05:30 IST