అడివివరంలో 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్
ABN , First Publish Date - 2020-12-08T05:05:31+05:30 IST
జీవీఎంసీ 98వ వార్డు పరిధి పాత అడివివరం కూడలి నుంచి కుమ్మరివీధి జంక్షన్ వరకు సోమవారం ఉదయం సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

సింహాచలం, డిసెంబరు 7: జీవీఎంసీ 98వ వార్డు పరిధి పాత అడివివరం కూడలి నుంచి కుమ్మరివీధి జంక్షన్ వరకు సోమవారం ఉదయం సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి వచ్చిపోయే భక్తులు, శొంఠ్యాం, దువ్వపాలెం తదితర ప్రాంతాల క్వారీల నుంచి రాయి, గ్రావెల్ రవాణా చేసే లారీలు, పద్మనాభం మీదుగా విజయనగరం నుంచి సింహాచలానికి రాకపోకలు సాగించే బస్సులతో ఈ రోడ్డులో రద్దీ పెరిగింది. ఇరుకు రోడ్డు కావడంతో పాటు రహదారికి ఇరువైపులా ఉండే చిల్లర వర్తకుల వద్ద కొనుగోలు చేసేందుకు వచ్చేవారితో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గోపాలపట్నం ట్రాఫిక్ పోలీసులు నియంత్రణ చర్యలు చేపడుతున్నప్పటికీ వాహనచోదకులు ఇష్టారాజ్యంగా పార్కింగ్లు చేస్తుండడమే ట్రాఫిక్ జామ్లకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.