మాస్క్లు కూడా లేవు!
ABN , First Publish Date - 2020-03-27T09:48:13+05:30 IST
‘సామాజిక దూరం పాటించండి...ముఖానికి మాస్క్లు ధరించండి...కరోనా వైరస్కు చెక్ చెప్పండి’...ఇదీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రజలకు
పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్లూ కూడా...
ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బంది ఆందోళన
‘పాజిటివ్’ కేసులకు చికిత్స అందిస్తున్న వారికి మాత్రమే ఎన్ 95 మాస్క్లు
మిగిలిన వారికి మౌత్ మాస్క్లే
అవి ధరించే అనుమానిత కేసుల పరిశీలన
ఇతర సదుపాయాలు కూడా లేవని ఆరోపణలు
ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్న వైద్యులు
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)
‘సామాజిక దూరం పాటించండి...ముఖానికి మాస్క్లు ధరించండి...కరోనా వైరస్కు చెక్ చెప్పండి’...ఇదీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రజలకు చెబుతున్న మాట. అయితే సాధారణ ప్రజల మాటెలా వున్నా కరోనా వైరస్ బారినపడిన, అనుమానిత లక్షణాల కలిగిన వారికి సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది రక్షణ విషయంలోనే అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...జిల్లాలోని కరోనా వైరస్ బారినపడిన రోగులు, అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఒక్కో షిఫ్టులో పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, ఎనస్థీషియా, సైకియాట్రీ విభాగాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్, పీజీలు, ఇతర సిబ్బంది కలిపి 25 మంది పనిచేస్తున్నారు.
ఈ వార్డులో పనిచేసే సిబ్బంది ఎవరూ వైరస్ బారినపడకుండా వుండేందుకు ఎన్ 95 మాస్క్లు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లను అందించాలి. వీటిని ధరిస్తే పూర్తి రక్షణ వుండేందుకు అవకాశముంది. అయితే వైరస్ బారినపడిన కేసులు చూస్తున్న ఇద్దరు, ముగ్గురికి తప్ప మిగిలిన సిబ్బంది ఎవరికీ ఈ రక్షణ పరికరాలు అందుబా టులో లేకపోవడంతో వైద్యులు, ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అనుమానిత లక్షణాలతో ఇక్కడ చేరిన వారిని ఇక్కడి సిబ్బంది మౌత్ మాస్క్లు ధరించే పరీక్షిస్తున్నారు.
ఇది అత్యంత ప్రమాదకరమని, రక్షణ సామగ్రి అందించాలని కోరినా అధికారులను పట్టించుకోలేదని ఈ వార్డులో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది తెలిపారు. అదేవిధంగా షిఫ్టులో పనిచేసే వైద్యులందరికీ కలిపి రెండు గదుల్లో ఆరు బెడ్లు మాత్రమే వున్నాయని, సరైన మంచి నీటి సదుపాయం కూడా లేక రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. రోగులకు సేవలు అందించే వైద్యులు, సిబ్బందికి ఆహారాన్ని కూడా సరఫరా చేయడం లేదంటున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న ఎంతో మంది పీజీలు బయట కొనుగోలు చేసి తెచ్చుకునే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టి సారించి ఇక్కడ పనిచేసే సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశముంటుందని వారు పేర్కొంటున్నారు.