అధికార పార్టీ దాడులు తిప్పికొడదాం
ABN , First Publish Date - 2020-12-27T05:35:04+05:30 IST
తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ చేస్తున్న దాడులను తిప్పికొట్టాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఏరోజు చేసిన దాడులు, ఆరోపణలపై అదేరోజు పత్రికాముఖంగా లేదా ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించారు.
ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు
జనవరి 10 నాటికి పార్టీ పార్లమెంటరీ కమిటీలు
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయం
విశాఖపట్నం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ చేస్తున్న దాడులను తిప్పికొట్టాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఏరోజు చేసిన దాడులు, ఆరోపణలపై అదేరోజు పత్రికాముఖంగా లేదా ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఇన్చార్జి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. విశాఖలో ఇటీవల తెలుగుదేశం నాయకులకు చెందిన భూములు, ఆస్తులపై దాడులు చేస్తున్నారని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులను వెంటనే తిప్పి కొట్టాలని అభిప్రాయపడ్డారు. వెలగపూడి రామకృష్ణబాబు, పీలా గోవింద్ ఆస్తులపై అధికారులు దాడులు చేయడం, రెండు రోజులుగా వెలగపూడి, వైసీపీ నేత విజయసాయిరెడ్డి సత్య ప్రమాణాల వ్యవహారం సమావేశంలో చర్చకు వచ్చింది. అధికార పార్టీలో కొందరు స్థాయి మరిచి టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శిస్తున్నారని, ఇటువంటి నాయకుల అక్రమాలను బహిర్గతం చేయాలని ఎమ్మెల్సీ బుద్ద నాగజదీశ్వరరావు చేసిన సూచనను అందరూ అంగీకరించారు. నగరంలో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, ఆగడాలను ఇకనుంచి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళతామని విశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాగా జిల్లాలో గ్రామ/మండల/వార్డు కమిటీల నియామకం చివరి దశకు వచ్చిందని నేతలు వివరించడంతో, విశాఖ దక్షిణంలో వార్డు కమిటీల నియామకానికి ఐదుగురితో కమిటీ వేయాలని చినరాజప్ప సూచించారు. అనకాపల్లి పార్లమెంటరీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బత్తుల తాతబ్బాయి పేరును ప్రకటించారు. వచ్చే నెల 10వ తేదీలోగా విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ కమిటీలను ప్రకటిస్తామని చినరాజప్ప వెల్లడించారు.
సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కోళ్ల లలితకుమారి, వంగలపూడి అనిత, లాలం భవాని, కేఎస్ఎన్ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడు, గండి బాబ్జీ . కర్రి సీతారామ్, ఎండీ. నజీర్, కాకి గోవిందరెడ్డి, బండారు అప్పలనాయుడు, చోడే పట్టాభి, మూర్తియాదవ్, లొడగల కృష్ణ, కోరాడ రాజబాబు, గంట నూకరాజు, ఏపీఎస్ సత్యనారాయణ, ధూళి రంగనాయకులు, రాంప్రసాద్, కొఠాని బాబ్జీ , కోట్నీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.