పోలీసు స్టేషన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-11-30T06:42:13+05:30 IST
భార్య తనపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిందని తీవ్ర మనస్థాపానికి గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదివారం కశింకోట పోలీసుస్టేషన్ వద్ద చోటుచేసుకుంది.
భార్య తనపై ఫిర్యాదు చేసిందని పురుగుల మందు తాగిన భర్త
కశింకోట, నవంబరు 29 : భార్య తనపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిందని తీవ్ర మనస్థాపానికి గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదివారం కశింకోట పోలీసుస్టేషన్ వద్ద చోటుచేసుకుంది. మండలంలోని తీడ శివారు కచ్చళ్లపాలేనికి చెందిన కచ్చళ్ల అప్పలనాయుడు, లీలా దంపతులు గత కొన్నిరోజులుగా ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో లీలా తన భర్త తనను తరుచూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పలనాయుడు పోలీసు స్టేషన్ వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతనిని అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తీసుకు వెళ్లారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.