‘గోవాడ’ కార్మికులు ఆకస్మిక ఆందోళన
ABN , First Publish Date - 2020-11-20T04:44:53+05:30 IST
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు... పలు డిమాండ్లు, సమస్యల పరిష్కారం విషయంలో యాజమాన్యం జాప్యం చేస్తుండడాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం విధులకు హాజరుకాకుండా హఠాత్తుగా ఆందోళనకు దిగారు.
![‘గోవాడ’ కార్మికులు ఆకస్మిక ఆందోళన](https://media.andhrajyothy.com/appimg/galleries/2020111911125129/11192020231445n28.jpg)
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
చర్చలు జరిపిన యాజమాన్య ప్రతినిధులు
తాత్కాలికంగా ఆందోళన విరమణ
గోవాడ, నవంబరు 19: గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు... పలు డిమాండ్లు, సమస్యల పరిష్కారం విషయంలో యాజమాన్యం జాప్యం చేస్తుండడాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం విధులకు హాజరుకాకుండా హఠాత్తుగా ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఫ్యాక్టరీ ఎండీ... ఏవో రమణమూర్తి, అక్కౌంట్స్ అధికారి దోహలి, వ్యవసాయాధికారులు మల్లికార్జునరెడ్డి, ప్రసాద్లను కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశించారు. దీంతో వారు ఆందోళన చేస్తున్న కార్మికుల వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా గుర్తింపు కార్మిక సంఘం నాయకుడు శరగడం రామునాయుడు మాట్లాడుతూ, 11 సంవత్సరాలుగా పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులకు వేతన సవరణ చేయలేదని, ఎన్ఎంఆర్ కార్మికులు.... పర్మనెంట్కు నోచుకోకుండానే కాకుండానే పదవీ విరమణ చేయాల్సి వస్తున్నదని, ఓచర్ పేమెంట్, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, కార్మికుల సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మనెంట్ కార్మికులకు వేజ్ బోర్డు అమలు చేయాలని, ఈలోగా మధ్యంతర భృతి కింద రూ.10 వేలు అలవెన్సు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్ఎంఆర్, కాంట్రాక్టు, ఓచర్ పేమెంట్ కార్మికుల వేతనాలు పెంచాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందిని కూడా కంపెనీ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. క్రషింగ్ సీజన్ ప్రారంభం అయ్యేలోగా తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేనిపక్షంలో విధులకు హాజరయ్యేది లేదని రామునాయుడు స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ ఏవో రమణమూర్తి మాట్లాడుతూ, కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఎండీ సానుకూలంగా ఉన్నారని, ప్రస్తుతం ఆయన అమరావతిలో వున్నారని, ఇక్కడకు వచ్చిన వెంటనే కార్మికులతో సమావేశమవుతారని, అందువల్ల విధులకు హాజరుకావాలని కార్మికులను కోరారు. దీంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు రాయి సూరిబాబు, పీఎస్ నాయుడు, జామి శ్రీను తదితరులు పాల్గొన్నారు.