అధిక వర్షాలతో 90 శాతం వరి పంట నష్టం
ABN , First Publish Date - 2020-10-23T10:23:29+05:30 IST
అధిక వర్షాలతో 90 శాతం వరి పంట నష్టం
సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ దేశగిరి శేఖర్
గూడెంకొత్తవీధి, అక్టోబరు 22: మండలంలోని ఎనిమిది గిరిజన గ్రామాల్లో ఆదివాసీ రైతులు సాగుచేస్తున్న వరి పంటలో 90 శాతం మేరకు నష్టం వాటిల్లినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ దేశగిరి శేఖర్ అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన తరంగణి రకం విత్తనాలు నాటుకోవడం వల్ల పంటను నష్టపోయామని ఆదివాసీలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం చింతపల్లి ఏడీఏ నవీన్ జ్ఞానామణి పర్యవేక్షణలో శాస్త్రవేత్తల బృందం జీకేవీధి పంచాయతీలో పర్యటించింది. వరి పంటను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త దేశగిరి శేఖర్ మాట్లాడుతూ.. అధిక వర్షాల కారణంగా రైతులు వేసిన 150 ఎకరాల్లో 90 శాతం వరి కంకులు పాలగింజలుగా మారిపోయాయని ప్రాథమికంగా గుర్తించామన్నారు.
మరోసారి ప్రధాన శాస్త్రవేత్త బృందంతో పరిశీలించి నష్టానికి గల కారణాలను అధ్యయనం చేస్తామన్నారు. ఏడీఏ నవీన్ జ్ఞానామణి మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులు పంట నష్టం ఇప్పించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు డాక్టర్ వినయ్కుమార్, మోహన్, వీఏహెచ్ పరమేశ్ పాల్గొన్నారు.