రైవాడ రిజర్వాయర్కు భారీగా వరద
ABN , First Publish Date - 2020-10-14T16:29:18+05:30 IST
రైవాడ జలాశయంలోకి వరద పోటెత్తింది. గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లుకాగా..

మూడు గేట్లు ఎత్తి 8,842 క్యూసెక్కులు విడుదల
దేవరాపల్లి(విశాఖపట్నం): రైవాడ జలాశయంలోకి వరద పోటెత్తింది. గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లుకాగా, అధికారులు 113.5 మీటర్లకు మించకుండా చూస్తూ, అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతున్నది. ఉదయం ఐదు గంటలకు ఒక గేటు నుంచి 1,220 క్యూసెక్కులు, మధ్యాహ్నం రెండు గేట్ల నుంచి ఐదు వేల క్యూసెక్కులు, సాయంత్రం ఆరు గంటలకు మూడు గేట్ల నుంచి 8,842 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లోనిబట్టి నీటి నిల్వలను క్రమబద్ధీకరిస్తామని డీఈఈ మాధవి, ఏఈఈ కార్తీక్ తెలిపారు.
కొట్టుకుపోయిన తాత్కాలిక కాజ్వే
రైవాడ నుంచి నీటిని విడుదల చేయడంతో దేవరాపల్లి సమీపంలో శారదా నదిపై వున్న తాత్కాలిక కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో దేవరాపల్లి, అనంతగిరి మండలాల్లో సుమారు 200 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.