రైల్వేస్టేషన్లలో ఉమ్మితే జరిమానా

ABN , First Publish Date - 2020-02-08T11:35:38+05:30 IST

ల్వే స్టేషన్లను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా వుంచడానికి రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది.

రైల్వేస్టేషన్లలో ఉమ్మితే జరిమానా

  • రూ.200 నుంచి రూ.300 వరకూ విధించే అవకాశం
  •  చెత్త వేస్తే రూ.100 నుంచి రూ.200
  • మూత్రం పోస్తే...రూ.300 నుంచి రూ.400
  • స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా నిర్ణయం
  • ఈ నెల 10వ తేదీ నుంచే అమలు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం) : రైల్వే స్టేషన్లను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా వుంచడానికి రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా కావాలని చెత్తవేసినా, మూత్రం పోసినా, గోడలను పాడుచేసినా ఉపేక్షించకూడదని నిర్ణయించింది. అటువంటి వారిని గుర్తించి జరిమానాలు వసూలు చేయాలని నిశ్చయించింది. ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’లో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమం అన్ని డివిజన్లలోను అమలు చేయనున్నట్టు తూర్పు కోస్తా రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఈ జరిమానాలు ఈ నెల పదో తేదీ నుంచే అమలులోకి వస్తాయి. స్టేషన్‌ కేటగిరీని బట్టి జరిమానాలు ఉంటాయి. స్టేషన్‌ మేనేజర్లు, సూపరింటెండెంట్లు, కమర్షియల్‌, ఆపరేషనల్‌ విభాగాల్లో టిక్కెట్‌ కలెక్టర్‌, ఆపై స్థాయి అధికారులు, గజిటెడ్‌ అధికారులు, ఆర్‌పీఎఫ్‌ అధికారులు (ఏఎస్‌ఐ కంటే పైస్థాయి) జరిమానాలు విధించవచ్చు.


  • చెత్తాచెదారం వేస్తే... రూ.100 నుంచి రూ.200
  • వంట చేస్తే రూ.500
  • ఉమ్మితే...రూ.200 నుంచి రూ.300
  • మూత్రం పోస్తే...రూ.300 నుంచి రూ.400
  • పక్షులు, జంతువుల ఆహారం వెదజల్లితే రూ.300 నుంచి రూ.500
  • పాత్రలు కడిగినా, దుస్తులు ఉతికినా రూ.300 నుంచి రూ.500
  • రైల్వే ఆవరణలో అనుమతి లేని నిల్వలు చేస్తే రూ.5,000
  • అనుమతి లేకుండా పోస్టర్లు అతికిస్తే...రూ.1,000 నుంచి రూ.2,000
  • అమ్మకందారులు డ్రై, వెట్‌ వేస్ట్‌లకు వేర్వేరు బిన్లు పెట్టకపోతే...రూ.వేయి నుంచి రూ.2 వేలు.
  • 50 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్‌ ఉపయోగిస్తే...రూ.300 నుంచి రూ.500


  • గతంలోను జరిమానాలు

రైల్వే అధికారులు జరిమానాలు విఽధించడం కొత్త ఏమీ కాదు. గతంలో ఏ-1, ఏ కేటగిరీ స్టేషన్లలో మాత్రమే అప్పుడప్పుడు వసూలు చేసేవారు. ఇప్పుడు సబర్బన్‌, నాన్‌ సబర్బన్‌, హాల్ట్‌ స్టేషన్లు అన్నింటిలోను జరిమానాలు వసూలు చేస్తారు. అప్పటికి ఇప్పటికి జరిమానాల్లో కొంత మార్పు చేశారు. 

2017-18లో 9,301 మంది నుంచి జరిమానాలు వసూలు చేయగా, 2018-19లో వారి సంఖ్య 10,582కి చేరింది. 2019లో డిసెంబరు వరకు 8,231 మంది నుంచి వసూలు చేశారు. చెత్త వేసినందుకు, ఉమ్మినందుకు వీరికి జరిమానాలు విధించారు.

Updated Date - 2020-02-08T11:35:38+05:30 IST