ప్రైవేటు ఈవెంట్‌కు వైసీపీ శ్రేణులు!

ABN , First Publish Date - 2020-11-21T06:04:48+05:30 IST

విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో శనివారం ఉదయం ఓ ప్రైవేటు సంస్థ ఏర్పాటుచేసిన ర్యాలీకి జనాలను తీసుకురావాలని వైసీపీ నాయకులను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆదేశించడంపై పార్టీ వర్గాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

ప్రైవేటు ఈవెంట్‌కు వైసీపీ శ్రేణులు!

ర్యాలీకి జనాన్ని తీసుకురావలసిందిగా విజయసాయిరెడ్డి ఆదేశాలు

పార్టీ నేతల గగ్గోలు


విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో శనివారం ఉదయం ఓ ప్రైవేటు సంస్థ ఏర్పాటుచేసిన ర్యాలీకి జనాలను తీసుకురావాలని వైసీపీ నాయకులను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆదేశించడంపై పార్టీ వర్గాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. స్టాప్‌ స్పీడ్‌ రైడ్‌...నినాదంతో శ్రీహర్ష ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఓ మహిళ శనివారం ఉదయం ర్యాలీ నిర్వహించతలపెట్టారు. దీనికి ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్యఅతిథి. ఆయనే స్వయంగా అందరికీ ఫోన్లు చేసి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థులు, వార్డు అధ్యక్షులు, ఇటీవల కార్పొరేషన్‌ పదవులు పొందినవారు తలా 25 మందికి తక్కువ లేకుండా మోటారు బైకులతో హాజరు కావాలని ఆదేశించారు. ప్రైవేటు ఈవెంట్‌కు పార్టీ శ్రేణుల తరలింపు ఏమిటో?, ఇది పార్టీ కార్యక్రమం కాదు కదా? అని చాలామంది చర్చించుకున్నారు. అయితే పెద్దాయన ఆదేశం కాబట్టి అంతా చెప్పినట్టే చేశారు. మొత్తానికి ర్యాలీ నిర్వహించారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ ప్రైవేటు ర్యాలీ బాగోతాన్ని అమరావతిలో పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. విజయసాయిరెడ్డి పాల్గొనే ప్రైవేటు కార్యక్రమాలకు కూడా పార్టీ శ్రేణులను తరలించాలంటే...తమ వల్ల కాదని వార్డు నాయకులు వాపోతున్నారు.

Updated Date - 2020-11-21T06:04:48+05:30 IST