ఇళ్ల స్థలాల పంపిణీకి సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2020-12-19T05:35:45+05:30 IST
ప్రభుత్వం ఈ నెల 25న పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాలను సబ్బవరంలో సిద్ధం చేసినట్టు ఏపీఐఐసీ ఎస్డీసీ సూర్యకళ తెలిపారు.
సబ్బవరం, డిసెంబరు 18 : ప్రభుత్వం ఈ నెల 25న పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాలను సబ్బవరంలో సిద్ధం చేసినట్టు ఏపీఐఐసీ ఎస్డీసీ సూర్యకళ తెలిపారు. మండలంలోని మొగలిపురం, అంతకాపల్లి, మలునాయుడుపాలెం, వంగలి, బోదువలస, ఎల్లుప్పి గ్రామాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లను తహసీల్దార్ రమాదేవితో కలిసి శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మండలంలో 2509 మంది లబ్ధిదారుల కోసం 32 లేఅవుట్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. పల్లవానిపాలెం, పైడివాడఅగ్రహారం, పైడివాడ గ్రామాల్లో మరో మూడు లేఅవుట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 32 లేఅవుట్లలో రోడ్లు, రోడ్లకు ఇరువైపుల మొక్కలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇళ్ల స్థలాలను ఈ నెల 25 నుంచి జనవరి 7 వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ కర్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కమతానికీ ఉచిత హద్దు రాళ్లు
ఈ నెల 21 నుంచి ప్రభుత్వం చేపట్టనున్న భూముల రీ-సర్వేలో ప్రతి కమతానికి ఉచితంగా సరిహద్దు రాళ్లు పాతుతామని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. మండలంలోని ఎరుకునాయుడుపాలెం, లగిశెట్టిపాలెం గ్రామాల్లో భూముల రీసర్వేపై గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించి లగిశెట్టిపాలెంలో రీసర్వే పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో సర్వేయర్ శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణ, సుధాకర్, వీఆర్వోలు సునంద, విజయశ్రీ, గ్రామ పెద్దలు పాలిశెట్టి సురేశ్, కాపుశెట్టి శేషుబాబు, అండిబోయిన బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.