కొత్త పింఛన్ల మంజూరుకు సన్నాహాలు

ABN , First Publish Date - 2020-05-29T09:32:20+05:30 IST

జిల్లాలో కొత్తగా మరికొంతమంది అర్హులకు పింఛన్లు అందజేయాలని అధికారులు నిర్ణయించారు.

కొత్త పింఛన్ల మంజూరుకు సన్నాహాలు

11,662 దరఖాస్తుల పరిశీలన

నెలాఖరునాటికి అర్హుల జాబితా


విశాఖపట్నం, మే 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా మరికొంతమంది అర్హులకు పింఛన్లు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అందిన 11,662 దరఖాస్తులకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎంపీడీవో, నగరంలో యూసీడీ, మునిసిపాలిటీల్లో మెప్మా అధికారుల నేతృత్వంలో సచివాలయ సిబ్బంది ప్రతి దరఖాస్తును పరిశీలిస్తున్నారు. రెండు మూడురోజుల్లో విచారణ పూర్తయి అర్హులతో కూడిన తుది జాబితా ఖరారవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుది జాబితాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తరువాత జూలై ఒకటి నుంచి పింఛన్లు అందజేస్తామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.


నవశకం సర్వే ఆధారంగా జిల్లాలో సుమారు 35వేల మందిని అనర్హులుగా తేల్చిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం చెలరేగడంతో జిల్లాలో అందరికీ (ఈ ఏడాది జనవరి జాబితా మేరకు) పింఛన్‌ పంపిణీ చేస్తున్నారు. నవశకం సర్వేలో అనర్హులుగా తేలిన జాబితాలో ఉన్నవారికి తమ అర్హత నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన కొత్త దరఖాస్తుల అప్‌లోడ్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. వచ్చే ఐదు లేదా ఆరో తేదీ నుంచి వీరంతా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైతే పింఛన్‌ మంజూరు చేస్తారని అధికారి ఒకరు తెలిపారు. 

Updated Date - 2020-05-29T09:32:20+05:30 IST