అంగరంగవైభవంగా అనంతుని పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2020-11-13T05:48:17+05:30 IST

పద్మనాభంలోని అనంత పద్మనాభుని ఆలయంలో పవిత్రోత్సవాలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

అంగరంగవైభవంగా అనంతుని పవిత్రోత్సవాలు
పవిత్రాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న దృశ్యం

అనంతునికి పవిత్రారోహణ చేసిన వేదపండితులు

 పద్మనాభం, నవంబరు 12: పద్మనాభంలోని అనంత పద్మనాభుని ఆలయంలో పవిత్రోత్సవాలను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సమస్తమైన దోష పరిహారం, లోక కల్యాణం కోసం చేపట్టిన పవిత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు విష్వక్షేన ఆరాధన,  ద్రవ్య, బాహ్య, అంతర్‌శుద్ధిల కోసం పంచనదుల జలాలతో పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం రుత్వికులు బేడా మండపంలో విశేషహోమాలు జరిపారు. అనంతుడు, కుంతీమాధవుల మూలవిరాట్టుకు వేదపండితుడు పి.బాలసుబ్రహ్మణ్య ఆచార్యులు ఆధ్వర్యంలో అష్ట కలశాలతో కూడిన జలాలు, పంచామృతాలతో అభిషేకాలు చేపట్టారు. అనంతరం మూలవిరాట్టును చందనాలంకృతం చేసి విశేష అర్చనలు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ శ్రీరంగం నుంచి రప్పించిన పవిత్రాలు, పూర్ణకుంభంతో ఈవో ఎన్‌.లక్ష్మీనారాయణశాస్త్రి, ప్రధాన అర్చకుడు సీతారామాంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఉత్సవంలో ప్రధాన అంకమైన పవిత్రాలను అనంత పద్మనాభస్వామి, రుక్మిణి, సత్యభామ సహిత కుంతీమాధవస్వామిల మూలవిరాట్టుకు, శ్రీదేవి, భూదేవి సహిత వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలకు అలంకరించారు. పవిత్రారోహణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ముగిసింది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డి.గోపీబాబు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాజేశ్వరి, వైసీపీ మండల అధ్యక్షుడు కె.రాంబాబు, న్యాయవాది ఈశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2020-11-13T05:48:17+05:30 IST