టెండ‘రింగ్’లో ఒకే ఒక్కడు!
ABN , First Publish Date - 2020-12-20T06:27:04+05:30 IST
రోడ్లు, భవనాల శాఖ జిల్లాలో చేపట్టనున్న రూ.220 కోట్ల విలువైన పనులను వైసీపీ రాష్ట్ర ముఖ్య నేత అనుచరుడిగా పేరుబడ్డ ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నారు.

రూ.220 కోట్ల పనులు దక్కించుకున్న అనంతపురం కాంట్రాక్టర్
వైసీపీ ముఖ్యనేత అనుచరుడికి దక్కిన ఆర్ అండ్ బీ కాంట్రాక్ట్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రోడ్లు, భవనాల శాఖ జిల్లాలో చేపట్టనున్న రూ.220 కోట్ల విలువైన పనులను వైసీపీ రాష్ట్ర ముఖ్య నేత అనుచరుడిగా పేరుబడ్డ ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) నిధులతో చేపట్టనున్న ఈ పను లకు రాష్ట్రంలో ఒక్కో జిల్లాను ఒక్కో యూనిట్గా తీసుకుని అధికారులు టెండర్లు పిలిచారు. జిల్లాలో పనులకు ముగ్గురు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ పనులను ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఖ్య నేత అనుచరులకు కట్టబెట్టాలని ముందు నుంచీ ప్రణాళిక వేసుకున్నారు. అందుకు అనుగుణంగానే టెండరింగ్ ప్రక్రియను నిర్వహించారు. ప్రతి జిల్లాలో పనుల కోసం మూడుకు మించి టెండర్లు పడకుండా చేశారు. అందులో భాగంగానే జిల్లాలో పనులను దక్కించుకునేందుకు జిల్లాతో సంబంధం లేని ముగ్గురు పెద్ద కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు అసలైన పోటీదారులు కాగా, ఒకరు డమ్మీగా వేశారు. వీరిలో ఒకరికి పనులను కట్టబెట్టా లని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించడంతో అనంతపురం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్కు పనులు దక్కాయి. రివర్స్ టెండరింగ్లో రూ.20 కోట్లు తక్కువకు కోట్ చేసి అదే కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నట్టు తెలిసింది. నెల రోజుల్లో పనులు ప్రారంభ మయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.