లంబసింగిలో ‘సమరయోధుల’ మ్యూజియం
ABN , First Publish Date - 2020-11-03T06:10:13+05:30 IST
పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి కేంద్రం రూ.15 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేశాయని ఏపీ గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ చీఫ్ జీఎస్వీవీఎస్ఎస్వీ ప్రసాద్ తెలిపారు.
రూ.35 కోట్లతో నిర్మాణం... త్వరలో టెండర్లు
టీడబ్ల్యూ ఇంజనీరింగ్ చీఫ్ ప్రసాద్
చింతపల్లి, నవంబరు 2: పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి కేంద్రం రూ.15 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేశాయని ఏపీ గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ చీఫ్ జీఎస్వీవీఎస్ఎస్వీ ప్రసాద్ తెలిపారు. సోమవారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించిన ఆయన పాఠశాలల్లో వసతులు, నాడు-నేడు పనులను తనిఖీచేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, 22 ఎకరాల్లో మ్యూజియం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.7.5 కోట్లు విడుదల చేశాయని, త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు.
ఉత్తరాంధ్రలో ఏడు ఏకలవ్య ఆదర్శ నివాస అనుబంధ పాఠశాలల నిర్మాణం జరుగుతున్నదని, ఒక్కొక్క పాఠశాలకు రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. రూ.5 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆశ్రమ పాఠశాలల్లో అదనపు వసతులు కల్పిస్తున్నామన్నారు. పాడేరు డివిజన్లో నాడు-నేడు పనులు సంతృప్తికంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఈఈ కేవీఎస్ఎన్ కుమార్, డీఈఈ డీవీఆర్ఎం రాజు, ఏఈఈలు దుర్గాప్రసాద్, రఘురామ్నాయుడు పాల్గొన్నారు.