డీడీలు కట్టినా అనర్హులుగా తేల్చినవారిని రీ సర్వే చేయండి
ABN , First Publish Date - 2020-11-27T05:38:05+05:30 IST
టిడ్కో ఇళ్ల కోసం అర్హులుగా గుర్తించడంతో డీడీలు తీసినప్పటికీ ఇటీవల సర్వే చేసి అనర్హులుగా ప్రకటించిన వారి విషయంలో మరోసారి సర్వే చేయాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజనను తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కోరారు.
జీవీఎంసీ కమిషనర్కు ఎమ్మెల్యే వెలగపూడి వినతి
విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): టిడ్కో ఇళ్ల కోసం అర్హులుగా గుర్తించడంతో డీడీలు తీసినప్పటికీ ఇటీవల సర్వే చేసి అనర్హులుగా ప్రకటించిన వారి విషయంలో మరోసారి సర్వే చేయాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజనను తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కోరారు. గురువారం జీవీఎంసీ కమిషనర్ చాంబర్లో ఆమెను కలిశారు. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల కోసం 43,844 మందిని అర్హులుగా గుర్తించడంతో వారంతా డీడీలు తీసి జీవీఎంసీకి అందజేశారన్నారు. అయితే 24,122 ఇళ్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో జీవీఎంసీ అధికారులు కొన్నాళ్ల కిందట సర్వే నిర్వహించి 28,575 మంది మాత్రమే అర్హులని, మిగిలిన 15,269 మంది అనర్హులుగా తేల్చారన్నారు. ఇళ్ల పంపిణీ పూర్తయిన తర్వాత మిగిలిపోయినవారితోపాటు అనర్హులుగా తేల్చిన వారి డీడీలను వెనక్కి ఇచ్చేస్తామని అధికారులు చెబుతున్నారని, అలాకాకుండా అనర్హులుగా తేలినవారి దరఖాస్తులను మరోసారి సర్వే చేసి అర్హులైనవారికి ఇళ్లను కేటాయించాలని, లేదంటే ఇంటి స్థలం పట్టాలు ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ రీ సర్వే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు.