నిద్ర మత్తులో మైనింగ్, విజిలెన్స్ అధికారులు
ABN , First Publish Date - 2020-12-31T05:07:59+05:30 IST
జిల్లాలో మైనింగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిద్ర మత్తులో ఉన్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు.
మాజీ మంత్రి బండారు విమర్శ
సబ్బవరం, డిసెంబరు 30: జిల్లాలో మైనింగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిద్ర మత్తులో ఉన్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. బుధవారం అసకపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబరు 1లో ఉన్న అక్రమ క్వారీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కొండలు కరిగిపోతున్నాయ్ కథనాన్ని ప్రస్తావించారు. పత్రికల్లో కథనాలు వచ్చిన తరువాత మైనింగ్శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దర్యాప్తు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ హయాంలో ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని చదును చేస్తుంటే పార్టీ నేత బలిరెడ్డి అప్పారావుకు మైనింగ్ అధికారులు రూ.4.6 లక్షలు జరిమానా విధించారని, ఎరుకునాయుడుపాలెంలో రెండు క్వారీలకు రూ.48 కోట్లు జరిమానా విధించిన అధికారులు ఇటువైపు ఎందుకు చూడడం లేదన్నారు. ఇప్పటికైనా అక్రమార్కులను గుర్తించి, భారీ జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంపదకు అధికారులే రక్షణ కల్పించాలన్నారు. ఆయన వెంట పార్టీ నేతలు బర్నికాన బాబూరావు, తమరాన బంగారు నాయుడు, ఈపు అప్పలరాజు, కరణం రామునాయుడు, గవర అప్పారావు తదితరులున్నారు.