మార్కెట్లు కిటకిట

ABN , First Publish Date - 2020-03-25T11:09:45+05:30 IST

తెలుగు సంవత్సరాది ఉగాది బుధవారం కావడంతో మహా నగరంలోని మార్కెట్లన్నీ మంగళవారం ఉదయం కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. అన్ని రైతుబజార్లతో పాటు

మార్కెట్లు కిటకిట

ఉగాది సందర్భంగా రైతుబజార్లకు పోటెత్తిన కొనుగోలుదారులు

కరోనా వైరస్‌ విజృంభిస్తున్నా మాస్క్‌లతో వచ్చిన జనం

ధరాభారంతో బెంబేలు


వన్‌టౌన్‌, మార్చి 24: తెలుగు సంవత్సరాది ఉగాది బుధవారం కావడంతో మహా నగరంలోని మార్కెట్లన్నీ మంగళవారం ఉదయం కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. అన్ని రైతుబజార్లతో పాటు పూర్ణామార్కెట్‌, కురుపాం మార్కెట్‌, ప్రముఖ కూడళ్లలో ఉన్న దుకాణాలన్నీ కొనుగోలుదారులతో సందడిగా కనిపించాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ ప్రజలంతా ముఖానికి మాస్క్‌లు, కర్చీఫ్‌లు, చున్నీలు చుట్టుకుని మరీ తమ సమీపంలోని మార్కెట్లకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ధరలు కూడా ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కొబ్బరికాయ సైజును బట్టి రూ.30 నుంచి రూ.60 మధ్య విక్రయించారు.


అరటిపండ్లు డజను రూ.100 నుంచి రూ.160కు, ఒక్కో మామిడికాయను రూ.20కు అమ్మడంతో తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని కొనుగోలుదారులు వాపోయారు. చివరకు మామిడాకులు రూ.20 నుంచి రూ.30కు, వేపచిగురును రూ.10 నుంచి రూ.20కు విక్రయించారు. అదేవిధంగా కాయగూరల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. కరోనా నేపథ్యంలో ఉదయాన్నే నగరవాసులు ఆయా రైతుబజార్లకు చేరుకుని వారం, పది రోజులపాటు సరిపడేలా కొనుగోలు చేయడంతో ఏడున్నరకల్లా చాలా బజార్లలో కాయగూరలు అయిపోయాయి.

Updated Date - 2020-03-25T11:09:45+05:30 IST