కంటైనర్‌ ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-12-13T05:43:46+05:30 IST

బైక్‌ను కంటైనర్‌ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.

కంటైనర్‌ ఢీకొని ఒకరి మృతి
సంఘటన స్థలంలో క్షతగాత్రుడు

మరొకరికి గాయాలు

మల్కాపురం, డిసెంబరు 12 : బైక్‌ను కంటైనర్‌ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం షీలానగర్‌ నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌కు వెళ్లే పోర్టు వంతెనపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. హార్బర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాపురానికి చెందిన చింతాడ ఆనంద్‌(50) పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు. అతని స్నేహితుడు రవీంద్ర వర్మ (42) డాక్‌యార్డులో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పని చేస్తున్నాడు. వీరిద్దరూ జగదాంబ వద్ద ఉన్న చర్చిలో శనివారం ఉదయం ప్రార్థనలు ముగించుకుని మల్కాపురం బయలుదేరారు. సరిగ్గా డాక్‌యార్డు సమీపానికి వచ్చే సరికి వారి బైక్‌ను వెనుక నుంచి కంటైనర్‌ బలంగా ఢీకొంది. దీంతో వారిద్దరూ బైక్‌తో సహా కంటైనర్‌ చక్రాల కింద పడిపోయారు. వారి పైనుంచి కంటైనర్‌ వెళ్లిపోవడంతో ఆనంద్‌ శరీరం నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందాడు. రవీంద్ర వర్మ గాయపడ్డాడు. ఆనంద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హార్బర్‌ పోలీసులు కేజీహెచ్‌కి తరలించారు. రవీంద్ర వర్మను ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఆనంద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. కాగా రవీంద్ర వర్మ అవివాహితుడు. హార్బర్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ మురళీరావు  కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-13T05:43:46+05:30 IST