అంగన్‌వాడీలకు తొలుత సరుకులు పంపిణీ చేయాలి

ABN , First Publish Date - 2020-12-06T06:18:05+05:30 IST

గిరిజన ప్రాంతంలోని అంగన్‌వాడీలకు తొలుత సరుకులు సరఫరా చేసిన తర్వాతే మైదాన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు అన్నారు.

అంగన్‌వాడీలకు తొలుత సరుకులు పంపిణీ చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ అరుణ్‌బాబు


జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు


అరకులోయ, డిసెంబరు 5: గిరిజన ప్రాంతంలోని అంగన్‌వాడీలకు తొలుత సరుకులు సరఫరా చేసిన తర్వాతే మైదాన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు అన్నారు. శనివారం హరితా సమావేశ మందిరంలో ఐసీడీఎస్‌ సీడీపీఓలు, అంగన్‌వాడీలకు సరుకుల సరఫరాదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సరుకుల సరఫరాలో జాప్యం చేయకుండా సకాలంలో పంపిణీ చేయాలన్నారు. సరుకుల్లో నిర్ధేశించిన నాణ్యతలు పాటించాలన్నారు. ముంచంగిపుట్‌ మండలం వనగుమ్మి అంగన్‌వాడీ కేంద్రానికి సరఫరా చేసిన రెండు బస్తాల పప్పుదినుసులు బూజు పట్టాయని సీడీపీఓ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఆ బస్తాలను సరఫరాదారులకు తిరిగి పంపేయాలని జేసీ ఆదేశించారు. ఐటీడీఏ పీఓ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ.. సంపూర్ణ పోషణ ప్లస్‌ సక్రమంగా అమలు చేస్తేనే మాతాశిశు మరణాలు నివారణ అవుతాయన్నారు. పోషకాహారాన్ని సరఫరా చేసే ఏజెన్సీలు సకాలంలో నాణ్యమైన సరుకులు అందజేయాలన్నారు. ఒడిశా దుకాణాల్లో మన అంగన్‌వాడీ పాలు విక్రయిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, దీనిపై సీడీపీవోలు విచారణ జరపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ ఎస్‌.సీతామహాలక్ష్మి, జీసీసీ డీఎం పార్వతమ్మ, జిల్లాలోని సీడీపీవోలు, సరఫరాదారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-06T06:18:05+05:30 IST