మన్యంలో జనతా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2020-03-23T09:07:28+05:30 IST

రోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రధాన మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ను మన్యం వాసులు సంపూర్ణంగా పాటించారు. ఏజెన్సీలో ఎక్కడా ఒక్క వాహనం కూడా...

మన్యంలో జనతా కర్ఫ్యూ

పాడేరు, మార్చి 22 : కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రధాన మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ను మన్యం వాసులు సంపూర్ణంగా పాటించారు. ఏజెన్సీలో ఎక్కడా ఒక్క వాహనం కూడా రోడ్డెక్కలేదు. జనం సైతం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. రాత్రి వరకు ఇదేవిధంగా కొనసాగింది. పర్యాటక ప్రదేశాలు, హోటళ్లు, దుకాణాలు, లాడ్జీలు, రిసార్టులు పూర్తిగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులను డిపోలోనే వుంచేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఖాళీగా వుంది. పెట్రోల్‌ బంకులు, వ్యాపార సంస్థలతోపాటు మోదకొండమ్మ ఆలయాన్ని కూడా మూసివేశారు.  పాడేరు, పర్యాటక కేంద్రమైన అరకులోయ, సబ్‌ డివిజన్‌ కేంద్రమైన చింతపల్లిల్లో నిత్యం రద్దీగా వుండే ప్రాంతాలన్నీ  నిర్మానుష్యంగా మారాయి. అరకులోయలో గిరిజన మ్యూజియం, పద్యాపురం గార్డెన్‌, గంజాయిగుడ గిరిజన గ్రామదర్శిని, బొర్రా గుహలను మూడు రోజుల క్రితమే మూసివేశారు. జీకేవీధి, కొయ్యూరు, ముంచంగిపుట్టు, పెదబయలు, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లోనూ జనతా కర్ఫ్యూను సంపూర్ణంగా పాటించారు. పోలీసులు కీలక ప్రాంతాల్లో సాయుధ బందోబస్తును ఏర్పాటు చేశారు. 


ఇళ్లకే పరిమితమైన ప్రముఖులు

జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలన్న ప్రధాన పిలుపుతో పాడేరులో పలువురు ప్రముఖులు ఆదివారం ఇళ్లల్లోనే వుండి, కుటుంబ సభ్యులతో గడిపారు. ఐటీడీఏ పీవో డీకేబాలాజీ, రాష్ట్ర పునరావాస ప్రత్యేక కమిషనర్‌ టి.బాబూరావునాయుడు, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తమ తమ ఇళ్లలోనే వుండిపోయారు.

Updated Date - 2020-03-23T09:07:28+05:30 IST