పారిశుధ్యం మెరుగుపరచాలి
ABN , First Publish Date - 2020-10-24T10:36:20+05:30 IST
పద్మాపరం పంచాయతీలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు.

ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్
పద్మాపురం సచివాలయం ఆకస్మిక తనిఖీ
అరకులోయ, అక్టోబరు 23: పద్మాపరం పంచాయతీలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పద్మాపురం సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను నిశితంగా పరిశీలించి, ఆరా తీశారు.
అనంతరం పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, అభివృద్ధి పనులపై పంచాయతీ కార్యదర్శి హేమలతను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పన్నులను వసూలు చేయాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి పథకాలకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. కొవిడ్-19పై అప్రమత్తంగా ఉండాలని, వైరస్ నిరోధానికి తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై మరో వారంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ జీవీ రాంబాబు, తహసీల్దార్ శ్యాంప్రసాద్ ఉన్నారు.