సాంకేతిక విద్యతోపాటు నైతిక విలువలు బోధించాలి
ABN , First Publish Date - 2020-03-15T11:45:26+05:30 IST
ఇంజనీరింగ్ విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు నైతిక విలువలు కూడా బోధించాలని అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ
![సాంకేతిక విద్యతోపాటు నైతిక విలువలు బోధించాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/20200315502/03152020061521n85.jpg)
అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ
భీమునిపట్నం (రూరల్) మార్చి 14 : ఇంజనీరింగ్ విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు నైతిక విలువలు కూడా బోధించాలని అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో అవెన్సస్ 2కే20 పేరిట నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాలను శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యలో నైతిక మానవతా విలువలు లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం జీవ నాశనానికి, సమాజ వినాశనానికి ఉపయోగపడుతుందన్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ మాట్లాడుతూ రానున్నకాలంలో మానవ జీవన విధానంలో, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయన్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా అనేక ఆవిష్కరణలు జరగనున్నాయని, ఈ విషయంలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆలోచనలు చేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్వీఎస్ గణేశ్ మాట్లాడుతూ ఈ యువజనోత్సవాలలో విద్యార్థులే అన్ని కార్యక్రమాలలో పాలుపంచుకున్నారన్నారు. సమావేశంలో అవంతి విద్యాసంస్థల చైర్మన్ ఎం.జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.