అత్యున్నత శిఖరాలే లక్ష్యం కావాలి
ABN , First Publish Date - 2020-11-06T05:40:08+05:30 IST
గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవడమేలక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.
![అత్యున్నత శిఖరాలే లక్ష్యం కావాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020110612085767/11062020000922n31.jpg)
ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపు
ఐఐటీ/ నిట్లో సీట్లు సాధించిన గిరి విద్యార్థులకు సత్కారం
పాడేరు, నవంబరు 5: గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవడమేలక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. విశాఖలోని మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల శిక్షణా సంస్థలో జేఈఈకి కోచింగ్ తీసుకుని, ఉత్తమ ర్యాంకులు సాధించి ఐఐటీ/ నిట్లలో సీట్లు పొందిన గిరిజన విద్యార్థులను గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్మానించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ, బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు పొందాలని, మన్యానికి ఆదర్శంగా నిలిచి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఐఐటీ విద్యార్థులకు బ్యాంకులు అందిస్తున్న విద్యా రుణాల వివరాలను ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ఎస్.శ్రీధర్ వివరించారు. ఐఐటీ/ ఎన్ఐటీల్లో సీట్లు పొందిన టి.మత్స్యలింగం (ఖరగ్పూర్), ఐ.సింహాచలం (ట్రిపుల్ ఐటీ కర్నూలు), ఎం.విజయకుమార్ (నిట్ బిలాస్పూర్), ఎస్.నానిప్రసాద్ (నిట్ ఆంధ్రప్రదేశ్), జి.పూర్ణచందర్, ఎస్.ఉదయకుమార్ (ఐఐటీ రాంచీ), ఎస్.మహేశ్ (ట్రిపుల్ ఐటీ కర్నూలు), టి.మెర్సీ (నిట్ రాయపూర్)లకు ల్యాప్టాప్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ జి.విజయకుమార్, గురుకుల శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.శివ ప్రసాద్, ప్రతిభ కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.