అఖిల్‌కు ఉరిశిక్ష వేయాలి

ABN , First Publish Date - 2020-11-03T06:14:36+05:30 IST

తమ కుమార్తెను అతి కిరాతకంగా హత్య చేసిన అఖిల్‌సాయిని ఎన్‌కౌంటర్‌ చేయాలని, లేకుంటే దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో విచారణ పూర్తిచేసి...ఉరిశిక్ష వేయాలని వరలక్ష్మి తల్లిదండ్రులు పద్మశ్రీ, గురునాథ్‌ డిమాండ్‌ చేశారు.

అఖిల్‌కు ఉరిశిక్ష వేయాలి
ఆవేదన వ్యక్తం చేస్తున్న వరలక్ష్మి తల్లిదండ్రులు

వరలక్ష్మి తల్లిదండ్రుల డిమాండ్‌

21 రోజుల్లో విచారణ పూర్తిచేయాలి

కంట్లో పెప్పర్‌ స్ర్పే చేసి... ఆ తరువాత బ్లేడ్‌తో దాడి చేశాడు


గాజువాక, నవంబర్‌ 2: తమ కుమార్తెను అతి కిరాతకంగా హత్య చేసిన అఖిల్‌సాయిని ఎన్‌కౌంటర్‌ చేయాలని, లేకుంటే దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో విచారణ పూర్తిచేసి...ఉరిశిక్ష వేయాలని వరలక్ష్మి తల్లిదండ్రులు పద్మశ్రీ, గురునాథ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం వారు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ అఖిల్‌కు బెయిల్‌ ఇస్తే తమ కుటుంబం, బంధువులంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అఖిల్‌ తండ్రి మాజీ రౌడీ షీటర్‌ అని, ఆయనతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. అందువల్ల ఆయనను కూడా అరెస్టు చేయాలని కోరారు.


చేతి మణికట్టు కూడా కోశాడు..

తొలుత తమ కుమార్తె కంట్లో పెప్పర్‌ స్ర్పే చేసి, ఆ తరువాత బ్లేడ్‌తో విచక్షణారహితంగా పీక, చేతి మణికట్టు  నరాలు కోశాడని ఆవేదన వ్యక్తంచేశారు. చేతిపై ఆరుచోట్ల గాయాలు వున్నాయని తెలిపారు. హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పారిపోయి, దుస్తులు మార్చుకొని దర్జాగా పోలీసుల వద్దకు వెళ్లాడని చెబుతూ  కన్నీరు పెట్టుకున్నారు. హంతకుడికి తమ కుమార్తెతో స్నేహం వుందనే మాట వాస్తవం కాదని, కేవలం ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు తప్ప...మరో పరిచయం లేదని వివరించారు. వారం రోజులుగా తమ కుమార్తె మనోవేదనతో వుందని, ఇంట్లో తాము అడిగినప్పటికీ ఏమీ చెప్పలేదని తెలిపారు. ప్రభుత్వం తమ కుటుంబానికి న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.

Updated Date - 2020-11-03T06:14:36+05:30 IST