ఇంజనీరింగ్‌ విభాగం పనితీరుపై కమిషనర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2020-11-13T06:05:22+05:30 IST

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం పనితీరుపై కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ప్రధాన ఇంజనీర్‌తో కలిసి వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనా థియేటర్‌లో సమీక్ష నిర్వహించారు.

ఇంజనీరింగ్‌ విభాగం పనితీరుపై కమిషనర్‌ సమీక్ష
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ సృజన

వెంకోజీపాలెం, నవంబరు 12: జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం పనితీరుపై  కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ప్రధాన ఇంజనీర్‌తో కలిసి వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనా థియేటర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్‌ పరిధిలోని 59 పాఠశాలల్లో ఆధునీకరణ పనులను చూసే బాధ్యతను పేరెంట్స్‌ కమిటీపై వదిలివేయకుండా పర్యవేక్షక ఇంజనీర్‌ స్థాయి నుంచి వార్డు ఎమినిటీస్‌ కార్యదర్శుల వరకు పర్యవేక్షించాలన్నారు. పనుల్లో ఉపయోగిస్తున్న మెటీరియల్‌, చేసిన పనుల్లో కూడా నాణ్యత ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో నిరంతరం నీరు, విద్యుత్‌ సరఫరా, ఫ్లోరింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. జీవీఎంసీ పరిధిలో గుర్తించిన 214 నీటి నిల్వ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు అంచనాలను రూపొందించి సమర్పిస్తే తగిన చర్యలు చేపడతామన్నారు. వీధి దీపాల సమస్యపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నందున వార్డు ఎమినిటీస్‌ కార్యదర్శులు రాత్రి ఏడున్నరప్పుడు సంబంధిత పర్యవేక్షక ఇంజనీరు ద్వారా ఆయా ప్రాంతాల్లో వీధి దీపాలు వెలిగిన ప్రగతి శాతంపై ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని ప్రధాన ఇంజనీర్‌ను ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వరరావు, పర్యవేక్షక ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-13T06:05:22+05:30 IST