పన్ను పెంపుపై ‘మహా’ కసరత్తు

ABN , First Publish Date - 2020-12-11T06:16:37+05:30 IST

స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను సవరణ చట్టం అమలుపై గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) అధికారులు కసరత్తు ప్రారంభించారు.

పన్ను పెంపుపై ‘మహా’ కసరత్తు

ఆస్తి మూల విలువ ఆధారంగా విధింపు

నివాస భవనాలకు 0.1 శాతం నుంచి 0.5 శాతం

వాణిజ్య భవనాలకు 0.2 శాతం నుంచి రెండు శాతం

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి

రిజిస్ర్టేషన్‌ విలువకు సంబంధించిన సమాచారం సేకరణ 

ఇప్పటికే 60 శాతం వరకూ మదింపు

ఎక్కడ ఎంత పెరుగుతందనేది నేటికి కొలిక్కివచ్చే అవకాశం

వచ్చే వారం కమిషనర్‌కు నివేదిక


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను సవరణ చట్టం అమలుపై గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటివరకూ అద్దె ఆధారంగా ఆస్తి పన్ను వసూలుచేస్తుండగా, ఏప్రిల్‌ (వచ్చే ఆర్థిక సంవత్సరం) నుంచి ఆస్తి మూలవిలువ ఆధారంగా వసూలు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టాన్ని సవరించింది. ఈ చట్టసవరణ ఆధారంగా జీవీఎంసీ పరిధిలో ప్రాంతాల వారీగా ఆస్తి పన్ను ఎంత వుండబోతోందీ పరిశీలించి నివేదిక అందజేయాలని ప్రభుత్వం మెమో జారీచేసింది. దీంతో ప్రస్తుతం ఎంత పన్ను వసూలు చేస్తున్నారు?, ఆస్తి విలువ ఆధారంగా అయితే ఎంత వసూలు చేయవలసింది వుంటుందనే దానిపై జీవీఎంసీ రెవెన్యూ అధికారులు వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు.


జోనల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో ఆయా జోన్ల అసిస్టెంట్‌ కమిషనర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లు ఈ పన్ను మదింపు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. జీవీఎంసీ పరిధిలో ఏ ప్రాంతంలో భూముల విలువ ఎంత ఉంది?, ఫ్లాట్ల విలువ చదరపు అడుగు ఎంత ఉంది? వంటి వివరాలను సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి తెప్పించుకున్నారు. ఆ డేటా ఆధారంగా ఆస్తిపన్ను ఎంత వుంటుందనే లెక్కలు వేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో అధికారికంగా 5.12 లక్షల అసెస్‌మెంట్లు వుండగా, అందులో 3.5 లక్షలు నివాస భవనాలు, మిగిలినవి వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. నివాస భవనాలకు ఆస్తి విలువలో 0.1 శాతం నుంచి 0.5 శాతం, వాణిజ్య పరమైన భవనాలు, దుకాణాలకు అయితే ఆస్తి విలువలో 0.2 శాతం నుంచి రెండు శాతం వరకూ ఆస్తిపన్నుగా నిర్ణయిస్తారు.


ఆస్తిపన్ను మదింపు ప్రక్రియ బుధవారం నాటికి 60 శాతం వరకూ పూర్తికాగా శుక్రవారం నాటికి శతశాతం పూర్తయ్యే అవకాశం వుందని జీవీఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. శుక్ర లేదా శనివారాల్లో అదనపు కమిషనర్‌ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో డీసీఆర్‌, జోనల్‌ కమిషనర్లతో సమావేశం ఏర్పాటుచేసి, జోన్లవారీగా నివేదికలు స్వీకరించనున్నారు. సోమవారం నాటికి తుదినివేదికను కమిషనర్‌కు, ఆ తర్వాత ప్రభుత్వానికి అందజేసే అవకాశం వుందని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త విధానం అమలైతే జీవీఎంసీకి ప్రస్తుతం సమకూరుతున్న ఆదాయం కంటే 33 శాతం వరకూ అదనంగా వచ్చే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2020-12-11T06:16:37+05:30 IST