సర్కారు ఆదేశాలు అలా..
ABN , First Publish Date - 2020-06-04T09:03:26+05:30 IST
ప్రభుత్వ ఆదేశాలకు నర్సీపట్నం మునిసిపల్ అధికారులు మోకాలడ్డుతున్నట్టు కనిపిస్తోంది.
‘మునిసిపల్’ వ్యవహారం ఇలా..!
ఆస్తి పన్నుల తగ్గింపులో అధికారుల ఇష్టారాజ్యం
టాక్స్పేయర్స్ అసోసియేషన్ ఎమ్మెల్యేకు వినతి
నర్సీపట్నం, జూన్ 3: ప్రభుత్వ ఆదేశాలకు నర్సీపట్నం మునిసిపల్ అధికారులు మోకాలడ్డుతున్నట్టు కనిపిస్తోంది. ఆస్తి పన్నుల తగ్గింపు వ్యవహారాన్నే ఇందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. పట్టణ వాసులకు భారంగా మారిన ఆస్తి పన్నును తగ్గిస్తామని ఎన్నికల ప్రచారం సమయంలో వైసీపీ హామీ ఇచ్చింది. ఆ మేరకు ఎమ్మెల్యే పెట్ట ఉమాశంకర్గణేష్ గత ఏడాది జూలై 27న శాసనసభ సమావేశాల్లో ఆస్తి పన్ను అంశాన్ని ప్రస్తావించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 5న జీవో నంబరు 144 విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం వసూలు చేస్తున్న సరాసరి అద్దె విలువ (ఎఆర్డీ) శాతాన్ని తద్వారా పన్ను రేట్లను గృహ సంబంధ భవనాలకు 23.94 శాతం నుంచి 19 శాతానికి, వాణిజ్య భవనాలకు 31.52 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని జీవోలో స్పష్టంగా పేర్కొంది.