రైతుకు నష్టం చేసే చట్టాలు రద్దుచేయాలి
ABN , First Publish Date - 2020-11-06T06:15:18+05:30 IST
రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎస్సీసీ సభ్య సంఘాల నాయకులు గురువారం అనకాపల్లిలో నిరసన చేపట్టారు.
![రైతుకు నష్టం చేసే చట్టాలు రద్దుచేయాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020110612420524/11062020004506n38.jpg)
వివిధ ప్రాంతాల్లో వామపక్షాల ఆందోళన
నెహ్రూచౌక్, నవంబరు 5 : రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎస్సీసీ సభ్య సంఘాల నాయకులు గురువారం అనకాపల్లిలో నిరసన చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ర్యాలీగా వచ్చి నెహ్రూచౌక్ జంక్షన్లో మానవహారం నిర్వహించారు. పంజాబ్, హర్యానా ప్రభుత్వాల మాదిరిగా చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి రైతులను కాపాడాలని పిలుపునిచ్చారు. సభ్య సంఘాల ప్రతినిధులు ఎ.బాలకృష్ణ, గాడి బాలు, మల్ల సత్యనారాయణ, వైఎన్ భద్రం, కె.హరినాథబాబు, ఎం.సబ్బారావు, ఆర్.దొరబాబు, ఎం.సత్యనారాయణ, కె.శంకరావు, బి.నూకఅప్పారావు, కోన లక్ష్మణ్, పి.వీరూయాదవ్, సత్యారావు, మజ్జి నూకరాజు, రైతులు పాల్గొన్నారు.
నక్కపల్లిలో..
నక్కపల్లి : అన్నదాతలకు తీవ్ర నష్టాలను కలి గించే చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇక్కడ సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, మండల కన్వీనర్ ఎం.రాజేశ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి నష్టం చేకూర్చే మూడు చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టిందన్నారు. వెంటనే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నర్సీపట్నంలో..
నర్సీపట్నం అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్షాల నాయకులు ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, జిల్లా రైతు సంఘం నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి, మేకా సత్యనారాయణ, రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.
హరిపాలెంలో..
అచ్యుతాపురం రూరల్ : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతులను నిలువునా ముంచేలా ఉన్నాయని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు అన్నారు. బిల్లులకు వ్యతిరేకంగా మండలంలోని హరిపాలెం గాంధీబొమ్మ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు. నాయకుడు రంగారావు, సదాశివరావు, రాము, సన్యాసిరావు, జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.
రాంబిల్లిలో
రాంబిల్లి : వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రాంబిల్లిలో సీఐ టీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును యూనియన్ మండ కార్యదర్శి జి.దేముడునాయుడు తప్పుబట్టారు. నాయకులు గంగరాజు, నూకరత్నం, పవన్కుమార్, అప్పలరాజు, నారాయణరావు, నూకరాజు పాల్గొన్నారు.
మునగపాకలో..
మునగపాక : వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించవద్దని, ఉచిత వ్యవసాయ విద్యుత్ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం నాయకులు మునగపాకలో మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. సంఘం నాయకులు కర్రి అప్పారావు, ఎస్.బ్రహ్మాజీ, ఆత్మారాం తదితరులు పాల్గొన్నారు.
కశింకోటలో...
కశింకోట: స్థానిక జాతీయ రహదారిపై రైతుల సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చడం, ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు కర్రి అప్పారావు, గండి నాయనబాబు, మాణిక్యాలరావు, శ్రీను పాల్గొన్నారు.