మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ పెట్టండి
ABN , First Publish Date - 2020-12-12T04:30:35+05:30 IST
ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశించారు.
అధికారులకు మంత్రి ముత్తంశెట్టి ఆదేశం
భీమునిపట్నం, డిసెంబరు 11: ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం భీమిలి క్యాంప్ ఆఫీసులో ప్రజా సమస్యలు, అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. భీమిలి 1,2,3 వార్డులతో పాటు విలీనమైన 4 వార్డులలో ప్రజలకు మంచినీరు, రహదారులు, వీధి దీపాలు, కాలువలు, పారిశుధ్యంపై దృష్టిపెట్టాలన్నారు. కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా కాని ప్రాంతాల్లో బోరుబావులు మంజూరుచేయాలని పలువురు నేతలు కోరారు. మరిన్ని సమస్యలను ప్రస్తావించడంతో అవన్నీ పరిశీలించి ప్రతిపాదనలు తయారుచేయాలని మంత్రి అధికారులకు సూచించారు. సమావేశంలో భీమిలి జడ్సీ సిహెచ్.గోవిందరావు, ఎంపీడీవో పి.వెంకటరమణ, ఏసీపీ అరుణవల్లి, తహసీల్దార్ ఈశ్వరరావు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.