14న అనంత పద్మనాభుని దీపోత్సవం

ABN , First Publish Date - 2020-12-06T05:55:44+05:30 IST

అనంత పద్మనాభస్వామి దీపోత్సవాన్ని ఈ నెల 14న కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మధురవాడ జోన్‌ ఏసీపీ ఆర్‌.రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు.

14న అనంత పద్మనాభుని దీపోత్సవం
సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ రవిశంకర్‌రెడ్డి

కరోనా దృష్ట్యా భక్తులు ఇళ్ల వద్దే దీపాలు వెలిగించుకోవాలి

మధురవాడ జోన్‌ ఏసీపీ రవిశంకర్‌రెడ్డి

పద్మనాభం, డిసెంబరు 5: అనంత పద్మనాభస్వామి దీపోత్సవాన్ని ఈ నెల 14న కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మధురవాడ జోన్‌ ఏసీపీ ఆర్‌.రవిశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. పలువురు అధికారులు, ప్రొటోకాల్‌ అతిథులతోనే దీపోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. శనివారం కుంతీమాధవస్వామి ఆలయ ప్రాంగణంలోని సామాజిక భవనంలో దీపోత్సవం నిర్వహణపై వివిధ శాఖల అధికారులు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా దృష్ట్యా భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాన్ని జరుపుతామన్నారు. అందువల్ల భక్తులంతా ఆ రోజున ఇళ్ల వద్దే దీపాలను వెలిగించుకోవాలని, ఎవరూ పద్మనాభం రావద్దని కోరారు. 14వ తేదీన పద్మనాభానికి వెళ్లే అన్ని రోడ్లలో బందోబస్తు ఏర్పాటు చేసి వాహనదారులు రాకుండా నిరోధిస్తామని, మెట్ల మార్గం, రోడ్డు మార్గంలో కూడా గస్తీ పెడతామన్నారు. దేవస్థానం ఈవో ఎన్‌ఎల్‌ఎన్‌ శాస్త్రి మాట్లాడుతూ వైదిక సంప్రదాయానికి ఎలాంటి ఆటంకం లేకుండా దీపోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. వైసీపీ ‘భీమిలి’ ఇన్‌చార్జి ఎం.మహేశ్‌ మాట్లాడుతూ పరిమిత సంఖ్యలో నిర్వహించే పద్మనాభుని దీపోత్సవానికి అందరూ సహకరించాలని కోరారు. వైసీపీ మండల అధ్యక్షుడు కె.రాంబాబు మాట్లాడుతూ పూర్వ సంప్రదాయాల మేరకు కొన్ని గ్రామాల్లోని భక్తులను, ముఖ్య కుటుంబాలను ఉత్సవానికి అనుమతించాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు, సీఐ ఎ.విశ్వేశ్వరరావు, సింహాచల దేవస్థానం పర్యవేక్షకుడు రాజేంద్ర, వైసీపీ నాయకుడు కె.లక్ష్మణ్‌, టీడీపీ మండల అధ్యక్షుడు కె.నగేశ్‌కుమార్‌ ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:55:44+05:30 IST