ఇళ్ల స్థలాల కోసం మా భూములు లాక్కోవద్దు

ABN , First Publish Date - 2020-12-06T04:10:37+05:30 IST

ఇళ్ల స్థలాల కోసం తమకు ఏకైక ఆధారమైన భూములను లాక్కోవద్దని మండలంలోని గాలిభీమవరం శివారు పల్లవానిపాలెం రైతులు శనివారం తహసీల్దార్‌ రమాదేవి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్ల స్థలాల కోసం మా భూములు లాక్కోవద్దు
తహసీల్దార్‌ను కలిసేందుకు వచ్చిన పల్లవానిపాలెం రైతులు

పల్లవానిపాలెం రైతుల వేడుకోలు


సబ్బవరం, డిసెంబరు 5 : ఇళ్ల స్థలాల కోసం తమకు ఏకైక ఆధారమైన భూములను లాక్కోవద్దని మండలంలోని గాలిభీమవరం శివారు పల్లవానిపాలెం రైతులు శనివారం తహసీల్దార్‌ రమాదేవి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్ల వెంకటేశ్‌, సింహాచలం, పెంటయ్య, సీతమ్మ, ముసిలినాయుడు, కన్నయ్యతో పాటు మరో 20 మంది రైతులు ఆమెకు కలిసి తమ గోడు వెలిబుచ్చారు. గ్రామం సర్వే నంబరు 64లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటూ, వృత్తి రీత్యా పశువులు, మేకలు, గొర్రెలు కాసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. తమ భూములను ఇళ్ల స్థలాల కోసం లాక్కుంటే రోడ్డున పడతామని వాపోయారు. ఇళ్ల స్థలాల కోసం వేరే చోట స్థలం ఏర్పాటు చేసి తమ భూములు తమకు విడిచిపెట్టాలని కోరారు. దీనిపై తహసీల్దార్‌ రమాదేవి స్పందిస్తూ గ్రామంలో 40 మందికి ఇళ్ల స్థలాలను ఆ సర్వే నంబరులో కేటాయించామన్నారు. అయితే రైతుల అభ్యర్థన మేరకు ప్రత్యామ్నాయంగా గ్రామానికి ఆనుకుని ఉన్న స్థలం పరిశీలిస్తామన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

Updated Date - 2020-12-06T04:10:37+05:30 IST