ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా
ABN , First Publish Date - 2020-12-25T05:55:05+05:30 IST
అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు, బదిలీలలో కొన్ని పోస్టులను మినహాయించడం తదితర అంశాలపై ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం పద్మనాభంలో ధర్నా చేశారు.
![ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122512220417/12252020002357n48.jpg)
పద్మనాభం, డిసెంబరు 24: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు, బదిలీలలో కొన్ని పోస్టులను మినహాయించడం తదితర అంశాలపై ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం పద్మనాభంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ బదిలీలలో బ్లాక్ చేసిన పోస్టులను కూడా ప్రభుత్వం చూపించాలని, లోపభూయిష్టంగా ఉన్న వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి నేరుగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పద్మనాభం మండలంలో 22 పోస్టులు ఖాళీలు ఉండగా కేవలం ఆరు పోస్టులను చూపించి 16 పోస్టులను మూసివేశారని, దీనివల్ల పది పాఠశాలలు ఏకోపాధ్యాయ స్కూళ్లుగా మారే అవకాశం ఉందన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ఆర్.జగదీశ్బాబు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి.సూర్యనారాయణ, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు సన్యాసినాయుడు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
భీమిలిలో..
భీమునిపట్నం: మాన్యువల్ విధానంలోనే ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఎస్జీటీలకు బదిలీలు చేయాలని, ప్రభుత్వం బ్లాక్ చేసిన పోస్టులను తక్షణం భర్తీ చేయాలంటూ గురువారం సాయంత్రం ఫ్యాప్టో ఆధ్వర్యంలో భీమిలి ఎంపీడీవో కార్యాలయం వద్ద పలువురు ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేశారు. తమ న్యాయమైన కోర్కెలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.