ఉపాధ్యాయ బదిలీ సమస్యల పరిష్కారానికి కృషి
ABN , First Publish Date - 2020-12-14T05:28:16+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు అన్నారు.

మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు
అనకాపల్లి, డిసెంబరు 13: ఉపాధ్యాయుల బదిలీల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక పీఆర్టీయూ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో మాన్యువల్ కౌన్సెలింగ్లో బదిలీలు చేపట్టాలన్నారు. పూర్తిస్థాయి ఖాళీలను జాబితాలో ఉంచాలని, బ్లాక్ చేయడం దారుణమన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హులైన ఎస్జీటీలతో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని, సర్వీసురూల్స్ అమలుచేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖ జిల్లాలో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవో 191 ప్రకారం ఉపాధ్యాయులు ఉదయం 9.30 గంటల నుంచి ఒంటి గంట వరకు పాఠశాలలో పనిచేయాల్సి ఉండగా, జిల్లాలో 9.30 నుంచి 11 గంటల వరకు పాఠశాలలోను, 11.30 గంటల నుంచి 1.30 వరకు స్కూల్ కాంప్లెక్సుకు వెళ్లాలని నిబంధనలు విధించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బుద్ద కాశీవిశ్వేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి అప్పారావు, అధ్యక్ష కార్యదర్శులు చక్రవర్తి, మహేష్, సత్యనారాయణ, వరం తదితరులు పాల్గొన్నారు.