అమ్మఒడికి తల్లుల అగచాట్లు

ABN , First Publish Date - 2020-12-27T05:30:00+05:30 IST

అమ్మఒడి పథకం కింద అర్హుల ఎంపిక ప్రక్రియ గజిబిజిగా, గందరగోళంగా తయారైందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అమ్మఒడికి తల్లుల అగచాట్లు

అర్హత నిరూపించే సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు ఇబ్బందులు

సచివాలయాల చుట్టూ అమ్మల ప్రదక్షిణలు

విత్‌హెల్డ్‌లో ఉన్న విద్యార్థులకు మరిన్ని పాట్లు 


విశాఖపట్నం, డిసెంబరు 27: అమ్మఒడి పథకం కింద అర్హుల ఎంపిక ప్రక్రియ గజిబిజిగా, గందరగోళంగా తయారైందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అనర్హులు, విత్‌హెల్డ్‌ జాబితాలో పేర్లు వున్న వారు, అర్హత కోసం విద్యార్థుల తల్లుల నానాపాట్లు పడుతున్నారు. ఈ పథకానికి తాము అర్హులమని చెప్పుకోవడానికి అవసరమైన ధ్రువపత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కాకపోవడం, గడువు సమీపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. అమ్మఒడి సాయం కోసం అర్హుల జాబితాలతోపాటు అనర్హులు, విత్‌హెల్డ్‌ జాబితాలను అధికారులు ఆయా సచివాలయాల్లో ప్రదర్శించారు. అనర్హత, విత్‌హెల్డ్‌ జాబితాలు పరిశీలించి ఆధార్‌, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లో తప్పులను సవరించే బాధ్యతను ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. అనర్హత జాబితా రూపకల్పనకు ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో పేర్లు ఉన్న వారు... ఈ పథకానికి తాము అర్హులమని చూపే డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి. ఈ బాధ్యతను గ్రామ/వార్డు సచివాలయాలకు అప్పగించారు. అయితే సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ ఒకపట్టాన కావడంలేదు. దీంతో విద్యార్థుల తల్లులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు ఈనెల 29వ తేదీ వరకు గడువు వున్నప్పటికీ వారిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. 


కాగా విత్‌హెల్డ్‌ జాబితాలో ఉన్న వారిని అర్హుల జాబితా చేర్చడానికి  ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది అమ్మఒడి సాయం కోసం సమర్పించిన ధ్రువపత్రాలను ఇప్పుడు  చూపితే విత్‌హెల్డ్‌లో నుంచి పేర్లు డిలీట్‌ కావడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా తల్లి లేకపోతే సంరక్షుడి పేరు చూపించినచోట అతని రేషన్‌కార్డులో విద్యార్థి పేరు లేకపోవడంతో విత్‌హెల్డ్‌లోనే కొనసాగుతున్నాడు. గత ఏడాది వచ్చిన ఇబ్బందులు మరోసారి రాకుండా పాఠశాల విద్యా శాఖ ఎందుకు చొరవ తీసుకోవడంలేదని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా జిల్లాలో అమ్మఒడి పథకం కింద ఇప్పటి వరకు 5,81,568 మందిని అర్హులుగా గుర్తించారు. 

Updated Date - 2020-12-27T05:30:00+05:30 IST